ప్రొటీన్ విషయంలో శాకాహారులు దిగులు పడుతుంటారు. తగినంత అందటం లేదేమో, ప్రొటీన్ పొడుల వంటివి తీసుకోవాలేమో అని అనుకుంటుంటారు. నిజానికి ఆహారం ద్వారా లభించేలా చూసుకోవటమే ఉత్తమం. మనకు ఒక కిలో శరీర బరువుకు రోజుకు 0.8 గ్రాముల ప్రొటీన్ అవసరం. అదే 50 ఏళ్లు దాటితే 1.2 గ్రాములు కావాలి. మాంసం, గుడ్డు వంటి జంతు ప్రొటీన్లలో మొత్తం 9 అమైనో ఆమ్లాలుంటాయి. వీటిని శరీరం బాగా గ్రహిస్తుంది కూడా. సోయాబీన్స్ మినహా చాలా శాకాహార పదార్థాల్లో ఒకటి, రెండు అమైనో ఆమ్లాలు మాత్రమే ఉంటాయి. అలాగని నిరాశ పడాల్సిన పనిలేదు. రకరకాల పదార్థాలను కలిపి తీసుకుంటే ఒకదాంతో మరోటి భర్తీ అవుతాయి. ఉదాహరణకు- బియ్యం, గోధుమల వంటి తృణ ధాన్యాల్లో లైసిన్ ఉండదు.
పప్పుదినుసుల్లో మిథియోనిన్ ఉండదు. కాబట్టి మూడొంతులు బియ్యం, గోధుమల వంటి తృణధాన్యాలు.. ఒక వంతు పప్పులు కలిపి తీసుకోవటం మంచిది. దీంతో బియ్యంలో లేని లైసిన్ పప్పులతో లభిస్తుంది. పప్పుల్లో లేని మిథియోనిన్ బియ్యం, గోధుమల నుంచి అందుతుంది. అప్పుడు అన్ని అత్యవసర అమైనో ఆమ్లాలు లభించినట్టవుతుంది. వీటిని శరీరం పూర్తిగా వాడుకుంటుంది. తగినంత ప్రొటీన్ అందుతుంది. మితిమీరి ప్రొటీన్ పొడులు వాడితే దీర్ఘకాలంలో దుష్ప్రభావాలకు దారితీయొచ్చు. మోతాదు మరీ ఎక్కువైతే కిడ్నీల మీద ఎక్కువ భారం పడుతుంది. ప్రొటీన్ జీర్ణమయ్యాక మిగిలిపోయే నత్రజనిని శరీరంలోంచి బయటకు పంపటానికి కిడ్నీలు ఎక్కువ పనిచేయాల్సి ఉంటుంది. కిడ్నీలు సరిగా పనిచేయని వారికిది చిక్కులు కలిగిస్తుంది.