PCOD | పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓడీ).. మహిళల్లో హార్మోన్ల రుగ్మత కారణంగా వచ్చే వ్యాధి. సాధారణంగా 12-45 సంవత్సరాల వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి పట్ల అవగాహన లేకపోవడం వల్ల 60-70 శాతం మంది మహిళలు దీని బారిన పడి ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. రుతుక్రమం సమయంలో అండం పరిపక్వత చెంది నెలనెలా విడుదలవుతుంది. నెలసరి తర్వాత 11-18 రోజుల మధ్య కాలంలో అండం విడుదలవుతుంది. ఇందుకు అవసరమయ్యే ఈస్ట్రోజెన్ హర్మోన్ సమతుల్యత దెబ్బతిని మేల్ హార్మోన్లుగా పిలిచే ఆండ్రోజెన్స్ విడుదలవుతాయి. ఇదే పీసీఓడీకి దారితీస్తుంది.
పీసీఓడీతో బాధపడుతున్న వారిలో అండం పూర్తిగా ఎదగక అండాశయంలో నీటి బుడగ రూపంలో ఉండిపోతుంది. కొందరిలో ఒకటికంటే ఎక్కువ తయారవుతుంటాయి. ఈ కారణంగా గర్భం ధరించడం కష్టతరంగా ఉంటుంది. అయితే జీవనశైలిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం ద్వారా పీసీఓడీని అదుపులో ఉంచుకోవచ్చు. ఈ వ్యాధి కారణంగా స్త్రీల ముఖంపై అవాంచిత రోమాలు ఏర్పడటం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. చక్కటి ముఖంపై అవాంచిత రోమాలు వచ్చి అంధవికారంగా తయారై నలుగురిలో తిరగలేక మదనపడుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు, జాగ్రత్తలు మీ కోసం..
లక్షణాలు..
పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, వచ్చినపుడు రక్తస్రావం తక్కువగా గానీ, ఎక్కువగా గానీ జరుగుతుంది.
నెలసరి రెండు లేదా మూడు నెలలకోసారి వస్తుంటుంది.
యుక్తవయసు వారికి మొటిమలు వస్తాయి. జుట్టు పలుచబడి రాలిపోతుంది.
ఛాతి, ముఖం, వీపు భాగంలో అవాంఛిత వెంట్రుకలు పెరుగుతాయి.
శరీరం ఉన్నట్టుండి బరువు పెరుగుతుంది.
ఛాతీ, వెన్ను లేదా పిరుదులపై అధికంగా జుట్టు పెరుగుతుంది.
చర్మం జిడ్డుగా మారి మొటిమలు వస్తాయి.
ఆత్మవిశ్వాసం కోల్పోయి కోపం, ఒత్తిడికి లోనవుతారు.
సమస్యలు..
అసాధారణ గర్భాశయ రక్తస్రావం జరుగుతుంది.
రక్తపోటు వంధ్యత్వం వస్తుంది.
టైప్ 2 డయాబెటిస్కు గురయ్యే అవకాశాలు ఉంటాయి.
నిద్ర లేమితో బాధపడుతుంటారు.
ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి.
జాగ్రత్తలు..
చేపలు, మాంసం, గుడ్లు, కూరగాయలు, పొద్దుతిరుగుడు, గుమ్మడి గింజలు, నువ్వులు తినాలి.
నిత్యం వ్యాయామం చేస్తుండాలి.
బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆహారంలో కొవ్వు పదార్ధాలు పూర్తిగా తగ్గించాలి.
తీపి పదార్థాలు, వెన్న, నెయ్యికి దూరంగా ఉండాలి.
ప్రాసెస్డ్ ఫుడ్, బేకరి ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, జంక్ఫుడ్ అస్సలు ముట్టకూడదు.
మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. అందుకు యోగా, వ్యాయామం, ధ్యానం చేయాలి.
రోజుకు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి.
పళ్లూ, ఆకుకూరలూ ఎక్కువగా తీసుకోవాలి.
చక్కెరలు అధికంగా ఉండే పదార్థాల జోలికెళ్లొద్దు.
పాలు, పాల పదార్థాలు మితంగానే తీసుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.