Appetite increase | ‘ఆకలిగా లేదమ్మా..’ అని చిన్నారులు చెప్తుండగా వింటుంటాం. స్కూల్ టిఫిన్ బాక్స్ అలాగే తీసుకొస్తారు. ఏంట్రా అంటే ఆకలి వేయలేదని సమాధానమిస్తారు. స్కూల్ నుంచి రాగానే చిప్స్లాంటివి లాగించేస్తుంటారు. అదే అన్నంకానీ, మరేదైనా తిరుచిండికానీ ఇష్టపడకుండా ఆకలిగా లేదని అనేస్తుంటారు. ఇలా వారిని వదిలేయడం వల్ల వారిని ఆరోగ్య సమస్యల వలయంలో నెట్టేస్తున్నామని మరిచిపోకండి. ఆకలి బాగా పెరగాలంటే ఏం చేయాలి..? అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఆకలి అయితేనే మనం ఆహారం తీసుకుంటాం. అలా తిన్నప్పుడే అది బాగా జీర్ణమవుతుంది. దాంతో శక్తి, పోషకాలు మన శరీరానికి లభిస్తాయి. అయితే ఆకలి లేకపోతే ఏ ఆహారాన్నీ తినలేం. ఆహారం గుర్తుకు వచ్చినా లేదా ఆహారాన్ని చూసినా వారికి చిరాకు వచ్చేస్తుంది. ఫలితంగా నీరసం, అలసట వస్తుంటాయి. ఈ క్రమంలో చాలా మంది ఆకలి లేకపోవడమనే సమస్యతో సతమతమవుతున్నారు. వివిధ ఆరోగ్య సమస్యలు కూడా ఆకలి నష్టానికి కారణమవుతున్నాయి. తలనొప్పి వంటి చిన్న సమస్య అయినా.. క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్యం అయినా.. ఆకలిని కోల్పోయేలా చేస్తుంటాయి. మైగ్రేన్, గుండె సమస్యలు, రుతుక్రమ సిండ్రోమ్, మద్యం, మాదకద్రవ్యాల వాడకం, కొన్ని రకాల మందుల దుష్ప్రభావాల కారణంగా ఆకలి లేమి కనిపిస్తుంది.
ఒక టీ స్పూన్ బెల్లం పొడిని అర టీస్పూన్ నల్ల మిరియాల పొడితో కలిపి నిత్యం ఒక పూట తీసుకోవడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది.
అర టీ స్పూన్ అల్లం రసంలో కొద్దిగా రాక్ సాల్ట్ కలిపి 10 రోజుల పాటు రోజూ ఈ మిశ్రమాన్ని భోజనానికి అర్ధ గంట ముందు తీసుకుంటే ఆకలి పెరుగుతుంది.
కప్పు నీటిలో 2 టీ స్పూన్ల ఉసిరి రసం, 2 టీ స్పూన్ల నిమ్మ రసం, 2 టీ స్పూన్ల తేనె కలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని నిత్యం పరిగడుపునే తీసుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే ఆకలి బాగా పెరుగుతుంది.
రోజూ భోజనం చేసే ముందు 2, 3 యాలకుల గింజలను నమిలి మింగాలి. దీంతో మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావడమే కాకుండా ఆకలి కూడా బాగా పెరుగుతుంది.
ఒక టీ స్పూన్ నిమ్మ రసంలో 2 టీ స్పూన్ల వాము కలిపి ఈ మిశ్రమాన్ని ఎండబెట్టాలి. అనంతరం దానిలో కొంత నల్ల ఉప్పును కలపాలి. ఈ మిశ్రమాన్ని నిత్యం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో తీసుకోవాలి. దీంతో ఆకలి పెరుగుతుంది.
ఆకలి పెంచే మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ దాల్చిన చెక్క. ఆకలి కాకుండా నియంత్రించే వికారానికి, వాంతులను నివారించడంలో కూడా సహాయపడుతుంది. దాల్చిన చెక్కను పొడి చేసి తినే గ్రేవీలో కలుపుకుని తీసుకోవాలి.
ద్రాక్షలో చాలా తక్కువగా యాసిడ్స్ ఉండి జీర్ణక్రియకు సహాయపడుతుంది. దాంతో ఆకలి పెరుగుతుంది. భోజనానికి భోజనానికి మధ్య ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.