న్యూఢిల్లీ : ఒమిక్రాన్ వేరియంట్తో పాటు డెల్టా స్ట్రెయిన్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. కొవిడ్-19తో పాటు శీతాకాలంలో ప్రబలే వైరల్ జ్వరాలు, జలుబు, ఫ్లూ వ్యాప్తితో ప్రజలు సాధారణ జలుబు, కొవిడ్-19 వైరస్ల మధ్య తేడాను పసిగట్టడంలో గందరగోళానికి గురువుతున్నారు. సాధారణ ఫ్లూ సోకితే జలుబు, దగ్గు, గొంతునొప్పి, నీరసం వంటి లక్షణాలు ఉంటాయి. కొవిడ్-19లోనూ ఇవే లక్షణాలు ఉంటుండగా, కొద్దిరోజులకు లక్షణాలు అంతకంతకూ పెరిగి కొందరిలో తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. సాధారణ జలుబు, కొవిడ్-19 లక్షణాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం కష్టమని అందుకే ముందుగా ఐసోలేట్ కావడంతో పాటు పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమని అపోలో టెలిహెల్త్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ముబషీర్ అలీ సూచించారు.
సాధారణ ఫ్లూ, కొవిడ్-19 భిన్నమైన వైరస్లతో వ్యాపిస్తాయని, ఫ్లూ వైరస్ (ఇన్ఫ్లూయంజా వైరస్లు) కారణంగా ఫ్లూ వైరస్తో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందని, 2019లో తొలుత గుర్తించిన కరోనావైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా కొవిడ్-19 సోకుతుందని వివరించారు. ఫ్లూలో పొడి దగ్గు, తుమ్ములు రావడం సహజమైతే కొవిడ్-19లో సాధారణంగా పొడి దగ్గు వస్తుందని, జలుబుతో పోలిస్తే కొవిడ్-19లో కోలుకునే సమయం అధికంగా ఉంటుందని చెప్పారు. ఇక కొవిడ్-19లో ఫ్లూ లక్షణాలతో పాటు అదనంగా జ్వరం, తలనొప్పి, ఒళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, రుచి, వాసన కోల్పోవడం, విరేచనాలు, చెవుల్లో శబ్ధాలు, చెవి నొప్పి వంటి లక్షణాలు బాధిస్తాయని తెలిపారు.
సాధారణ జలుబు వారం నుంచి పదిరోజుల వరకూ ఉంటుందని, జలుబు వంటివి వాటితో పోరాడేందుకు మన శరీరానికి తగిన సమయం ఇస్తే చాలావరకూ వాటంతటవే తగ్గుతాయని డాక్టర్ అలీ చెప్పారు. విపరీతంగా తుమ్ములు, ముక్కుకారడం, కండ్ల నుంచి నీరుకారడం వంటి లక్షణాలు కొవిడ్-19కు సంబంధించినవి కాదని, అయితే శ్వాస సంబంధ సమస్యలతో పాటు రుచి, వాసన కోల్పోయిన వారు తక్షణమే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.