Mens Health | దేశంలో పురుషుల ఆరోగ్యానికి అతిపెద్ద ముప్పుగా గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు కారణమవున్నాయి. మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పొగాకు వినియోగం, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి వంటి కారణాల వల్ల ఈ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా వీటిని చాలావరకు నివారించవచ్చని సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాల్లో సుమారు 74 శాతం అంటువ్యాధులు కాని వ్యాధుల కారణంగానే సంభవిస్తున్నాయి. వీటిలో గుండె సంబంధిత వ్యాధులే అత్యధికంగా ప్రాణాలు తీస్తున్నాయి. దేశంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గుండె జబ్బులతోపాటు మధుమేహం, నివారించగలిగే అనేక రకాల క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వంశపారంపర్య కారణాలు కొంతవరకు ప్రభావం చూపినా ధూమపానం, ఊబకాయం, అనారోగ్యకరమైన ఆహారం, అధిక మద్యం సేవించడం, వ్యాయామం చేయకపోవడం వంటి ప్రధాన ప్రమాద కారకాలను నియంత్రించడం ద్వారా వ్యాధి ముప్పును గణనీయంగా తగ్గించవచ్చు. దేశంలో పురుషుల మరణాలకు ప్రధాన కారణంగా గుండె సంబంధిత వ్యాధులు నిలుస్తున్నాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరగడం, ఊబకాయం, ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం, దీర్ఘకాలిక ఒత్తిడి వంటి అంశాలు గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఛాతిలో నొప్పి, ఊపిరి ఆడకపోవడం, అసాధారణ అలసట, తల తిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి ప్రారంభ లక్షణాలను చాలామంది నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించాలంటే క్రమం తప్పకుండా రక్తపోటు, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం, వారానికి కనీసం 150 నిమిషాల పాటు మోస్తరు స్థాయి వ్యాయామం చేయడం, పొగాకు ఉత్పత్తులను పూర్తిగా మానేయడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక మధుమేహ రోగులు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (IDF) డయాబెటిస్ అట్లాస్ 2025 ప్రకారం దేశంలో 10 కోట్లకు పైగా పెద్దలు మధుమేహంతో జీవిస్తున్నారు. మరోవైపు లక్షలాది మంది ప్రీ-డయాబెటిస్ దశలో ఉండటం వల్ల భవిష్యత్తులో వారికి మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్ అధికంగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం, వంశపారంపర్య కారణాలు మధుమేహం పెరగడానికి ప్రధాన కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు. నియంత్రణలో లేని మధుమేహం గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు, కంటి చూపు కోల్పోవడం, నరాలు దెబ్బతినడం, పాదాల్లో పుండ్లు వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.
ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడం, చక్కెర, ప్రాసెస్డ్ ఆహారాన్ని తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవడం ద్వారా టైప్-2 మధుమేహాన్ని నివారించే అవకాశం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. పురుషుల్లో క్యాన్సర్ కూడా మరో ప్రధాన ఆరోగ్య ముప్పుగా మారుతోంది. ముఖ్యంగా నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. పొగాకు నమలడం లేదా ధూమపానం చేయడం నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్కు ప్రధాన కారణంగా గుర్తించారు. అధిక మద్యం సేవించడం, పోషకాహార లోపం, పర్యావరణ కాలుష్యం, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉండడం వంటి అంశాలు కూడా ప్రమాదాన్ని పెంచుతాయి. పొగాకు వినియోగదారులు నోటి క్యాన్సర్కు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం, వయస్సు, కుటుంబ చరిత్ర, వ్యక్తిగత ప్రమాద కారకాల ఆధారంగా ప్రోస్టేట్ క్యాన్సర్ పరీక్షలపై వైద్యుల సలహా తీసుకోవడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రారంభ దశలో క్యాన్సర్ను గుర్తిస్తే చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఆరోగ్యకరమైన జీవనశైలి ఈ మూడు ప్రధాన వ్యాధుల ముప్పును గణనీయంగా తగ్గిస్తుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే సమతుల ఆహారం తీసుకోవడం, వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడం, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండడం, మద్యం పరిమితంగా తీసుకోవడం లేదా పూర్తిగా మానేయడం, యోగా లేదా ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం, ప్రతిరోజూ తగినంత నిద్రపోవడం వంటి అలవాట్లు ఆరోగ్యాన్ని కాపాడతాయి. పురుషులు సాధారణంగా మహిళలతో పోలిస్తే ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంలో వెనుకబడుతున్నారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందువల్ల రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్, బాడీ మాస్ ఇండెక్స్ (BMI), నడుము కొలత, అవసరమైతే మూత్రపిండాల పనితీరు పరీక్షలు, వయస్సు, ప్రమాద కారకాల ఆధారంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రమాదకరమైనవే అయినప్పటికీ అవి తప్పనిసరిగా రావాల్సిన అవసరం లేదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధుల ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.