ఎండలు ముదురుతున్నాయి. బండలు పగులుతున్నాయి. గుండెల్లో భయం మొదలవుతున్నది. గడప దాటితే చాలు. గండాలు చుట్టుముట్టినట్టే. వడదెబ్బ శరీరం మొత్తాన్నీ ప్రభావితం చేస్తుంది. అలా అని, తలుపులు బిగించుకుని కూర్చోలేం. తగిన జాగ్రత్తలతో ఎండను ఢీకొనాలి. వడదెబ్బకు ఎదురుదెబ్బ కొట్టాలి. ఇదే మన సమ్మర్ స్ట్రాటజీ.
ఎండల్లో బయటికి వెళ్తున్నారా? జాగ్రత్త. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనున్నదని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. సాధారణంగా ఏప్రిల్, మే మాసాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోతాయి. దీంతోపాటు వేడి గాలులూ వీస్తాయి. ఫలితంగా వడదెబ్బ ప్రభావం పొంచి ఉంటుంది. ఈ సీజన్లో వడదెబ్బ ధాటికి ప్రతినిత్యం ఎక్కడో ఒకచోట.. మరణాలు సంభవిస్తూ ఉంటాయి.
సాధారణంగా మనిషి నిర్ణీత వాతావరణానికి అలవాటు పడి ఉంటాడు. అతని శరీర ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. అంతకు మించిన ఉష్ణోగ్రతను తట్టుకోలేడు. ఆ దెబ్బకు రకరకాల వ్యాధులకు గురవుతాడు. పలు సందర్భాల్లో మృత్యువాత పడతాడు కూడా. ఆ ప్రకారంగా.. సూర్యరశ్మి వల్ల వెలువడే వేడి కారణంగా అస్వస్థతకు గురికావడాన్నే వడదెబ్బ అంటారు. సాధారణంగా 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడే వడదెబ్బ సమస్య ఏర్పడుతుంది. అందులోనూ.. 38-40 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ప్రాణాంతకంగా మారుతుంది.
ఎండలో తిరగడం వల్లే కాదు.. వేడి గాడ్పులతో కూడా శరీరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఆ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ దాటితే దాన్ని ‘హైపర్ థెర్మియా’గా వ్యవహరిస్తారు. హైపర్ థెర్మియాతో
శరీరంలోని థెర్మోరెగ్యులేషన్ దెబ్బతింటుంది. ఉష్ణో గ్రతలు అదుపు తప్పుతాయి. దీంతో ఒంట్లోని జీవరసాయనాలు (ఎంజైమ్లు) వేడెక్కి పలుచబడతాయి. ఆ ప్రభావంతో శరీరంలోని జీవకణాలు (సెల్స్) సక్రమంగా పనిచేయవు. ఆ వేడికి కండరాలు వ్యాకోచిస్తాయి. ఒళ్లునొప్పులు వచ్చేస్తాయి. శరీరంలోని నీరంతా ఆవిరైపోయి.. శక్తిహీనులుగా మారిపోతారు. జీవకణాలు, కండరాలు దెబ్బతినడంతో మెదడు, గుండెకు రక్తప్రసరణ నిలిచిపోతుంది. కిడ్నీలు మొరాయిస్తాయి. శరీరంలోని అవయవాలన్నీ పనిచేయడం మానేస్తాయి. చివరికి మనిషి మృత్యువాత పడతాడు.
మనం ఎండలో తిరుగుతున్నప్పుడు.. నేరుగా సూర్యకిరణాలు మన మీద పడతాయి. దీనివల్ల ఒంట్లో ఉన్న లవణాలు చెమట రూపంలో బయటికి వచ్చి, ఆవిరైపోతాయి. దీంతో మనిషి నీరసించిపోతాడు.
వడదెబ్బకు గురైనవారిని వెంటనే నీడపట్టున కూర్చోబెట్టాలి. మంచినీళ్లు తాగించాలి. తగిన గాలి, వెలుతురు వచ్చేలా చూడాలి. వైద్యులను సంప్రదించి, శరీరం డీ-హైడ్రేషన్కు గురికాకుండా.. స్లైన్ పెట్టాలి. చికిత్సలో భాగంగా ఓఆర్ఎస్ నీళ్లు, డెక్స్ట్రోస్ ఫ్లూయిడ్, నార్మల్ స్లైన్, రింగర్ లాక్టేట్, ఐవీ మెట్రోజిల్, యాంటీబయోటిక్స్ మాత్రలైన సిప్రోఫ్లాక్సాసిన్, నార్ఫ్లాక్సాసిన్, టెట్రాసైక్లిన్, యాంటీ బయోటిక్స్ ఇంజెక్షన్స్ అమికాసిన్ తదితర మందులను వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. సొంత చికిత్స వద్దు.
వివిధ ద్రవాహారాలతో పాటు.. పండ్లు, కాయగూరలు పుష్కలంగా తీసుకోవాలి. సిట్రస్ జాతి ఫలాలు ఎంతో మంచి చేస్తాయి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు, నిమ్మకాయ నీళ్లు, జావలు పుష్కలంగా తీసుకోవాలి. పసిపిల్లలు, దీర్ఘకాలిక రోగుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏ లక్షణాన్నీ నిర్లక్ష్యం చేయలేం. ఎలాంటి పరిస్థితిలోనూ నిర్లిప్తంగా ఉండలేం. ఈ సమయంలో అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువే. పిల్లలు నిప్పుల వైపు వెళ్లకుండా కట్టడి చేయాలి. ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సిద్ధంగా ఉంచుకోవాలి.
– డాక్టర్ జయలక్ష్మిఆర్ఎంవో, ఫీవర్ హాస్పిటల్ హైదరాబాద్
…?మహేశ్వర్రావు బండారి