Health Tips | కొంతమంది నవ యవ్వనంలో మెరుపు తీగలా ఉంటారు. కానీ, నాలుగు పదులు దాటగానే ఆకృతి మారిపోతుంది. ఇలా నడి వయసులో బరువు పెరగడానికి ప్రధాన కారణం.. ఆహారంలో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం. నిజానికి, కార్బొహైడ్రేట్లు లభించే ఆహార పదార్థాలు కూడా మనకు ముఖ్యమైనవే. కాకపోతే మోతాదు మించకూడదు.
బీఎంజే జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. సిరి ధాన్యాలు, పండ్లు, గంజి పదార్థాలు లేని కూరగాయలు తింటే నడి వయసులో తక్కువ బరువు పెరుగుతాం. మరోవైపు రిఫైన్డ్ ధాన్యాలు, గంజి పదార్థం ఉండే కూరగాయలు, చక్కెర కలిగిన పానీయాలు ఊబకాయానికి దారితీస్తాయి. 65 ఏండ్లలోపు వయసు కలిగిన 1,36,432 మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం చేశారు.
సర్వేలో పాల్గొన్నవారంతా తమ పేరు నమోదు చేసుకున్న సమయంలో పరిపూర్ణ ఆరోగ్యవంతులే. తమ ఆహారం, జీవనశైలి, ఇతర ఆరోగ్య విషయాల గురించి పరిశోధకులకు సమగ్ర సమాచారం అందించారు. 2 నుంచి 4 ఏండ్ల చొప్పున.. 24 సంవత్సరాల వ్యవధిలో వివరాలను సేకరించారు. సర్వేలో పాల్గొన్నవారు ప్రతి నాలుగేండ్లకు 1.5 కిలోలు, మొత్తం 24 ఏండ్ల కాలంలో 8.8 కిలోల బరువు పెరిగారు. అయితే, వీరిలో ఎక్కువగా రిఫైన్ చేసిన ధాన్యాలు, యాడెడ్ షుగర్స్, చక్కెర పానీయాలు, బఠానీలు, మక్కజొన్న, ఆలుగడ్డలు లాంటి గంజి పదార్థం ఉన్న కూరగాయలను తిన్నవాళ్లు ఎక్కువ బరువు పెరిగారట.
సిరి ధాన్యాల నుంచి వచ్చే కార్బొహైడ్రేట్లు, ఫైబర్, పండ్లు, బ్రొకోలి, క్యారెట్, పాలకూర లాంటి గంజి పదార్థం లేని కూరగాయలు తీసుకున్నవారేమో తక్కువ బరువు పెరిగారట. పైగా బరువు పెరగడానికి, ఆహారానికి మధ్య సంబంధం అనేది.. అప్పటికే బరువు అధికంగా మహిళల్లో మరింత ఎక్కువగా ఉందట. కాబట్టి మధుమేహం, గుండె రోగాలు, క్యాన్సర్ ముప్పు తగ్గించుకోవడానికి సిరిధాన్యాలు, గంజి లేని కూరగాయలు, పండ్లు తినడం ఉత్తమం.