ఎండలు పెరిగాయి. అధిక వేడితోపాటు అసౌకర్యాలూ ఉన్నాయి. ఇంతే కదా అనుకుని వాతావరణానికి అనుగుణంగా అలవాట్లు మార్చుకోకపోతే అనేక సమస్యలు వస్తాయి. ఈ వేసవిలో వచ్చే అలాంటి సమస్యల్లో సెగ గడ్డలు ఒకటి. కొంతమందికి ప్రతి వేసవిలో ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వ్యాధినిరోధకత తక్కువగా ఉండటం, జీవన శైలే దీనికి కారణం. కాబట్టి ఇలాంటి వాళ్లు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చర్మంలో నుంచి వెంట్రుక బయటికి వచ్చే చోట బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా సెగ గడ్డలు అవుతాయి. ఈ ఇన్ఫెక్షన్ పెరగడం వల్ల శరీరంలో చీము ఏర్పడుతుంది. గడ్డ పరిమాణం పెరగడంతోపాటు నొప్పి ఉంటుంది.
ఈ సమస్య వస్తే పసుపుని నీళ్లలో కలిపి గడ్డపై రాస్తే ఇన్ఫెక్షన్ నుంచి కొంత ఉపశమనం ఉంటుంది. వెల్లుల్లుని పేస్టుగా చేసుకుని కూడా గడ్డపై రాసుకోవచ్చు. వేడి నీటిలో ముంచిన వస్త్రంతో కాపడం పెడితే రక్త ప్రసరణ పెరిగి ఉపశమనంతోపాటు త్వరగా తగ్గుతుంది. బలవంతంగా వత్తకూడదు. పగిలినప్పుడు చీము కారితే జాగ్రత్తగా శుభ్రం చేయాలి. అవసరమైతే చర్మ వ్యాధుల వైద్యుడిని సంప్రదించాలి.
సెగ గడ్డలు రావడానికి ప్రధాన కారణం అపరిశుభ్రత. ఉదయం, సాయత్రం స్నానం చేస్తున్నాం. కాబట్టి శుభ్రంగా ఉంటున్నట్టు కాదు. వేడి వాతావరణంలో రోజంతా ఉంటే చెమట పడుతుంది. బయట తిరగడం వల్ల దుమ్ము, ధూళి చర్మంపై పేరుకుంటుంది. ఇవన్నీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కు కారణం అవుతాయి. కొందరు స్నానం చేసినా విడిచిన దుస్తులు మళ్లీ ధరిస్తారు. వేసవిలో ఈ పొరపాటు అసలే చేయకూడదు. స్నానం చేసిన తర్వాత ఉతికిన టవల్తోనే ఒళ్లు తుడుచుకోవాలి. వీటితోపాటుగా వేడిని పెంచే సిల్క్, జీన్స్ దుస్తులు ధరించకూడదు. అలాగే బిగుతుగా ఉండే దుస్తులు కొంతకాలం వాడకుండా ఉంటే మంచిది. అంతేకాదు, శరీరానికి వేడి చేసే ఆహార పదార్థాలకు వీలైనంత దూరం పాటించడం అవసరం. ఇవి పాటిస్తే సెగ గడ్డల సమస్యకు చెక్ పెట్టొచ్చు.