న్యూఢిల్లీ : దేశంలో తాజాగా బయటపడుతున్న టైప్ 2 మధుమేహ కేసుల్లో 55 శాతం రోగుల్లో హెచ్డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉన్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిస్ధితి వారి జీవితకాలంలో కొన్ని రకాల హృద్రోగాల బారినపడే ముప్పునకు దారితీస్తుందని తేలింది. ఇక టైప్ 2 మధుమేహుల్లో 42 శాతం మందికి హైపర్టెన్షన్ ముప్పు అధికంగా ఉంటుందని ఇండియా డయాబెటిస్ స్టడీ తెలిపింది. దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాల్లో 48 ఏండ్ల సగటు వయసున్న 5080 మందిపై 2020-21 మధ్య ఈ అధ్యయనం చేపట్టారు.
1900 మంది డాక్టర్ల భాగస్వామ్యంతో 16 మంది వైద్యులు ఎరిస్ లైఫ్సైన్సెస్ సహకారంతో అధ్యయనం నిర్వహించారు. అధ్యయన వివరాలు పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. దేశవ్యాప్తంగా టైప్2 మధుమేహులుగా తాజాగా గుర్తించిన కేసుల్లో హృద్రోగ ముప్పు కారకాలను ఇండియా డయాబెటిస్ అధ్యయనంలో వెలుగుచూశాయని అధ్యయన వివరాలను వెల్లడిస్తూ చెల్లారం డయాబెటిక్ ఇనిస్టిట్యూట్ చీఫ్ డాక్టర్ ఏజీ ఉన్నికృష్ణన్ తెలిపారు. ఆహారంలో మార్పులు, శారీరక వ్యాయామం, గ్లూకోజ్ నియంత్రణ, బీపీ, కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవడం వంటి జాగ్రత్తలపై దృష్టి సారించాలని ఈ దిశగా చికిత్సలో మార్పులు చేపట్టాలని సూచించారు.
మధుమేహ రోగుల్లో అధెరోలెరోటిక్ కార్డియోవాస్కులర్ వ్యాధి ముప్పు అధికమని అధ్యయన సహరచయిత, ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఎండోక్రినాలజీ డిపార్ట్మెంట్కు చెందిన డాక్టర్ ఆర్కే సహాయ్ పేర్కొన్నారు. హృద్రోగ ముప్పును నివారించేందుకు గ్లూకోజ్ కంట్రోల్తో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉండేందుకు చికిత్స అవసరమని స్పష్టం చేశారు. వ్యాయామం, ఆహార నియంత్రణతో మధుమేహాన్ని సమర్ధంగా నియంత్రించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.