న్యూయార్క్ : ఒత్తిడితో కూడిన విధి నిర్వహణలో అదనపు గంటలు పనిచేస్తే కుంగుబాటుకు దారితీస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఒత్తిడితో కూడిన పని గంటలు వైద్యులపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై యూనివర్సిటీ ఆఫ్ మిషిగాన్కు చెందిన పరిశోధక బృందం ఈ అధ్యయనం చేపట్టింది.
కొద్ది గంటలు పనిచేసే వారితో పోలిస్తే ఎక్కువ గంటలు అధికంగా పనిచేసే వారిలో మధ్యస్ధ నుంచి తీవ్ర కుంగుబాటు లక్షణాలు కనిపించినట్టు ఈ అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలు ఒత్తిడి, కుంగుబాటు చికిత్సలో దిక్సూచీగా పరిగణించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వారానికి 40 నుంచి 45 గంటలు పనిచేసే వారిలో సగటు డిప్రెషన్ లక్షణం 1.8 పాయింట్ల మేర పెరిగినట్టు తేలింది.
90 గంటలకు పైగా పనిచేసే వారిలో ఈ లక్షణాలు 5.2 పాయింట్లు పెరిగినట్టు కనుగొన్నారు. పనిచేసిన గంటలు, కుంగుబాటు లక్షణాల మధ్య డోస్-రెస్పాన్స్ సంబంధాన్ని పరిశోధకులు గుర్తించారు. 17,000 మందికి పైగా ఫస్టియర్ మెడికల్ రెసిడెంట్స్పై 11 ఏండ్ల పాటు సేకరించిన గణాంకాల ఆధారంగా పరిశోధకులు ఈ విషయాలను గుర్తించారు. న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.