న్యూఢిల్లీ : తల్లి పాలు ఆరోగ్య ప్రయోజనాలకు శ్రేష్టమని చెబుతుంటారు. బ్రెస్ట్ ఫీడింగ్తో శిశువుకు ఇన్ఫెక్షన్లు సోకకుండా రోగనిరోధక వ్యవస్ధ అభివృద్ధి (Health Tips) చెందుతుంది. వీటిలో ఉంటే యాంటీబాడీలు శిశువు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పిల్లలకు, పాలిచ్చే తల్లులకూ బ్రెస్ట్, ఒవేరియన్ క్యాన్సర్ల ముప్పుతో పాటు మధుమేహం వంటి జీవనశైలి వ్యాధుల ముప్పూ తగ్గుతుందని పరిశోధనలు వెల్లడించాయి.
అమెరికాలోని మసాచుసెట్స్కు చెందిన టఫ్ట్స్ వర్సిటీ హ్యూమన్ న్యూట్రిషన్ రీసెర్చి సెంటర్ ఆన్ ఏజింగ్ (హెచ్ఎన్ఆర్సీఏ) పరిశోధకులు తల్లిపాల ప్రయోజనాలపై సరికొత్త వివరాలు వెల్లడించారు. తల్లిపాలలో ఉండే షుగర్ మాలిక్యుల్కు శిశవు మెదడు ఎదుగుదలకూ సంబంధం ఉందని గుర్తించారు. తల్లులు పాలిచ్చే తొలి నెలల్లో పాలల్లో మయో-ఇనోసిటోల్ అనే మైక్రోన్యూట్రియంట్ ఉంటుందని ఈ అధ్యయనంలో కనుగొన్నారు.
ఈ సూక్ష్మ పోషకం శిశువు మెదడు ఎదుగుదలకు, ఉత్తేజానికి తోడ్పడుతుందని పరిశోధకులు గుర్తించారు. మెక్సికో, సిన్సినాటి, షాంఘై నగరాల్లోని ఆరోగ్యవంతులైన తల్లుల నుంచి తల్లిపాల నమూనాలను పరిశోధకులు పరిశీలించిన మీదట ఈ వివరాలు వెల్లడించారు. ఇక ఎలుకలు, మానవ న్యూరాన్లపై నిర్వహించిన పరీక్షల్లో మెదడు ఎదుగుదలో మయో-ఇనోసిటాల్ సానుకూల ప్రభావం చూపిందని గుర్తించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్లో గ్లోబల్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ హ్యూమన్ మిల్క్ స్టడీ ఫలితాలు ప్రచురితమయ్యాయి.