న్యూయార్క్ : అమెరికాలోని యేల్ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో కీలక విషయాలు వెలుగుచూశాయి. మరణం తర్వాత కణజాల క్షీణతను ఆపడం ద్వారా వైద్యపరమైన పురోగతిని సాధించారు. మరణానంతరం కణజాలం, అవయవాల పునరుద్ధరణపై ఈ పరిశోధన సరికొత్త ఆశలకు ఊపిరిపోసింది. మరణానంతరం కణాల పనితీరును పునరుద్ధరించవచ్చని ఈ అధ్యయనంలో వెల్లడవడం వైద్య రంగంలో నూతన ఒరవడికి నాంది కానుంది.
భవిష్యత్తులో మార్పిడి చేయదగిన మానవ అవయవాల సంఖ్యను పెంచడంలో ఊతమిచ్చే పరిశోధనలో భాగంగా పందులపై నిర్వహించిన ప్రయోగంలో సత్ఫలితాలు వెల్లడయ్యాయి. మత్తుమందు ఇచ్చిన జంతువుల్లో గుండె పనిచేయడం ఆగిపోయిన అరవై నిమిషాల తర్వాత గుండెలో రక్త ప్రసరణను పునరుద్ధరించడంలో పరిశోధకులు విజయం సాధించారు. గుండె ఆగిపోయిన తర్వాత శరీరం అంతరిస్తుందని మనం అనుకుంటున్న విధంగా శరీరం మరణించదని ఈ ఫలితాలు తేటతెల్లం చేశాయి.
కణజాల ఆరోగ్యాన్ని పెంచే, వాపును తగ్గించే పరికరాలు, ఆక్సిజన్ ద్రవాలతో కూడిన సింథటిక్ ద్రవాన్ని మోసుకేళ్లుందుకు పరిశోధకులు ఓ ప్రత్యేక యంత్రాన్ని వాడుతూ ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఆర్గానెక్స్ టెక్నాలజీగా పిలిచే చికిత్స ద్వారా ఆరుగంటల తర్వాత అవయవాల్లో వాపు, రక్తనాళాలు దెబ్బతినడాన్ని తగ్గించగలిగామని పరిశోధకులు పేర్కొన్నారు. కార్డియాక్ అరెస్ట్తో రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల వాపు, రక్తనాళాలు దెబ్బతింటాయి. ఇక రక్తప్రసరణ పునరుద్ధరణతో మాలిక్యులర్, సెల్యులర్ మరమ్మత్తు ప్రక్రియలు ప్రారంభమైనట్టు గుర్తించామని పరిశోధకులు తెలిపారు.