న్యూఢిల్లీ : సైలెంట్ కిల్లర్గా పేరొందిన అధిక రక్తపోటు ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని కబళిస్తోంది. రక్తపోటును సరైన ఆహార పదార్ధాలతో మెరుగ్గా నియంత్రించవచ్చని పలు అధ్యయనాలు వెల్లడించగా నిత్యం పెరుగును వాడటం ద్వారా రక్తపోటు స్ధాయిలను తగ్గించవచ్చని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పరిశోధకులు చేపట్టిన తాజా అధ్యయనం నిగ్గుతేల్చింది. అధిక రక్తపోటుతో బాధపడేవారు పెరుగును ఎక్కువగా తీసుకోవడం ద్వారా వారి రక్తపోటు స్ధాయిలు గణనీయంగా తగ్గాయని ఇంటర్నేషనల్ డెయిరీ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం స్పష్టం చేసింది.
పెరుగు వంటి డెయిరీ ఉత్పత్తులు బీపీని నియంత్రిస్తాయని తమ అధ్యయనంలో వెల్లడైందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు డాక్టర్ అలెగ్జాండ్ర వేడ్ తెలిపారు. డెయిరీ ఉత్పత్తుల్లో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి సూక్ష్మ పోషకాలు బీపీ నియంత్రణకు ఉపకరిస్తాయని చెప్పారు. రక్తపోటు పెరిగిన సమయాల్లో పెరుగును కొద్దిమొత్తంలో తీసుకున్నా బీపీ స్ధాయి తగ్గుముఖం పట్టినట్టు వెల్లడైందన్నారు. పెరుగును రోజూ తీసుకునేవారిలో రక్తపోటు స్ధాయిలు మరింత మెరుగ్గా ఉన్నాయని చెప్పారు.
పెరుగు తినని వారితో పోలిస్తే పెరుగును రోజూ ఆహారంలో భాగంగా తీసుకునేవారి బీపీ ఏడు పాయింట్లు తక్కువగా ఉందని తమ పరిశోధనలో గుర్తించామని తెలిపారు. ఇక పెరుగులో ప్రేవుల ఆరోగ్యానికి మేలు చేసే ప్రొ బయాటిక్స్తో పాటు పుష్కలంగా ప్రొటీన్లు ఉంటాయని ఇవి శాఖాహారుల ప్రొటీన్ అవసరాలకు సరిపోతాయని చెప్పారు. ప్రొబయాటిక్స్ గ్యాస్, మలబద్ధకం నివారణలోనూ ఉపకరిస్తాయి. పెరుగులో ఉండే క్యాల్షియం, విటమిన్ డీ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నిత్యం పెరుగు తీసుకోవడం ద్వారా బరువునూ అదుపులో ఉంచుకోవచ్చు.