న్యూఢిల్లీ : వయసు పెరిగే కొద్దీ అధిక రక్తపోటు, మధుమేహ రోగుల్లో స్ట్రోక్ ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. జర్నల్ న్యూరాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం మందులతో నియంత్రిచదగిన రక్తపోటు, మధుమేహం స్ట్రోక్ ముప్పునకు మూలకారణాలు కాగా, వయసు మీరిన వారిలో ఈ ముప్పు తక్కువగా ఉందని తేలింది. అధిక రక్తపోటు, మధుమేహ రోగులు వయసు పెరుగుతున్న కొద్దీ స్ట్రోక్ ముప్పు తగ్గుతున్నదని తమ అధ్యయనంలో వెల్లడైందని అధ్యయన రచయిత, యూనివర్సిటీ ఆఫ్ అలబామాకు చెందిన జార్జ్ హోవర్డ్ తెలిపారు.
ఇతర ముప్పు కారకాల్లో వయసు మీరడంతో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. దీంతో స్ట్రోక్ ముప్పు అధికంగా ఎవరికి ఉందనేది వారి వయసుకు అనుగుణంగా నిర్ధారించవచ్చని తెలిపారు. అధ్యయనంలో పాల్గొన్న వారిని పరిశోధకులు వయసుల వారీగా మూడు గ్రూపులుగా విభజించారు. 45-69 ఏండ్ల వారిని ఓ గ్రూపుగా, 60,70 ఏండ్ల పైబడిన వారిని మరో గ్రూపుగా, 74 ఏండ్ల కంటే ఎక్కువ వయసువారిని మరో గ్రూపుగా విభజించారు.
వీరిలో తక్కువ వయసు వారు అదే వయసులో ఉండి మధుమేహం లేని వారితో పోలిస్తే రెండు రెట్లు అదికంగా స్ట్రోక్ ముప్పును ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. ఇక అధిక వయసు ఉన్న మధుమేహులు తమ వయసు వారిలో మధుమేహం లేనివారితో పోలిస్తే 30 శాతం అధికంగా స్ట్రోక్ ముప్పును కలిగిఉన్నారని ఈ అధ్యయనంలో తేలింది. ఇక అదే తరహాలో తక్కువ వయసు గ్రూపులోని రక్తపోటు రోగులకు అదే వయసున్న రక్తపోటు లేని వారితో పోలిస్తే స్ట్రోక్ ముప్పు 80 శాతంగా వెల్లడైంది. అధిక వయసున్న రక్తపోటు రోగులకు అదే వయసు కలిగిన రక్తపోటు లేని వారితో పోలిస్తే స్ట్రోక్ ముప్పు 50 శాతం మాత్రమే ఉందని అధ్యయనంలో తేలింది.