న్యూఢిల్లీ : శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు ఆహారంలో తప్పక ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు తినడం ద్వారా మలబద్ధకాన్ని నివారించి జీవక్రియల వేగం పెంచి జీర్ణ క్రియ సాఫీగా సాగుతుంది. పండ్లను మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసుకోవచ్చని వీటికి ప్రత్యేకించి ఓ సమయం అంటూ ఉండదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
పండ్లు ఏ సమయంలో తినాలి, ఎలా తినాలనే దానిపై పలు అపోహలు ప్రచారంలో ఉన్నాయని వాటిని నమ్మాల్సిన అవసరం లేదంటున్నారు. ముఖ్యంగా పండ్లను పరగడుపునే తీసుకోవాలని, ఖాళీ కడుపుతోనే తినాలని చెబుతుంటారు. ఇది వాస్తవం కాదని పోషకాహార నిపుణులు స్పష్టం చేశారు. భోజనంతో కలిపి పండ్లను తీసుకుంటే వీటిలో ఉండే ఫైబర్తో జీర్ణక్రియ మందగించి గ్యాస్, అజీర్తి, మలబద్ధకానికి దారితీస్తుందని చెప్పడంలో కొంత వాస్తవం ఉన్నా మీల్స్తో కలిపి పండ్లను తీసుకుంటే జీర్ణక్రియ పూర్తిగా నిలిచిపోదు.
పైగా భోజనంలో పండ్లను కలిపి తీసుకుంటే కడుపు నిండిన భావనంతో ఎక్కువ తినకుండా ఉంటాము. ఇక భోజనం ముందు లేదా భోజనం ముగిసిన తర్వాతే పండ్లు తినాలనే అపోహపై పోషకాహార నిపుణులు వివరణ ఇస్తూ పండ్లలో ఉండే పోషకాలను శరీరం గ్రహించేందుకు ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుంది. మీరు ఎప్పుడు పండ్లు తినాలనిపిస్తే అప్పుడు తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే పండ్లు తినాలనే ప్రచారం కూడా సరికాదని పండ్లను రోజులో ఏ సమయంలోనైనా తీసుకోవచ్చని, ఉదయాన్నే తీసుకోవాలనే నిబంధనేమీ లేదని చెబుతున్నారు.