న్యూఢిల్లీ : పలు పోషకాలతో నిండిన బీట్రూట్ ఆరోగ్యాన్ని కాపాడటంలో ముందుంటుంది. కరోనరీ హార్ట్ డిసీజ్తో బాధపడేవారు రోజూ ఓ గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. మాంచెస్టర్లో జరిగిన బ్రిటిష్ కార్డియోవాస్క్యులర్ సొసైటీ సదస్సులో ఈ పరిశోధనను సమర్పించారు. రోజూ ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే హృద్రోగుల్లోని రక్తనాణాల్లో వాపు ప్రక్రియను నివారిస్తుందని ఈ పరిశోధనలో గుర్తించారు.
పరిశోధనలో భాగంగా 114 మంది వాలంటీర్లపై పరీక్షలు నిర్వహించారు. వీరికి వారం రోజుల పాటు ఉదయం 140ఎంఎల్ బీట్రూట్ జ్యూస్ ఇచ్చారు. వీరిలో కొందరికి నైట్రేట్ అధికంగా ఉన్న జ్యూస్, మరికొందరికి నైట్రేట్ లేని జ్యూస్ను ఇచ్చారు. వారం రోజుల తర్వాత నైట్రేట్ అధికంగా ఉన్న జ్యూస్ను తీసుకున్న వారి రక్తనాణాల్లో వాపు ప్రక్రియ వేగంగా తగ్గుముఖం పట్టడం కనుగొన్నారు. శరీరంలో సహజంగా ఉత్పత్తయ్యే నైట్రిక్ ఆక్సైడ్ మెరుగైన ఆరోగ్యానికి అత్యంత కీలకం.
ఇది బీపీని నియంత్రించడంతో పాటు శరీరంలో వాపు ప్రభావాన్ని తగ్గిస్తుంది. హృద్రోగాలతో బాధపడే వారిలో నైట్రిక్ ఆక్సైడ్ నిల్వలు తక్కువగా ఉంటాయి. నైట్రేట్స్ అధికంగా ఉండే బీట్రూట్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అధ్యయనంలో గుర్తించారు. నైట్రిక్ ఆక్సైడ్ అధికంగా ఉన్నవారిలో రికవరీ వేగంగా ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఇక హృద్రోగులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు పరిశోధకులు సిద్ధమవుతున్నారు. నైట్రేట్ అధికంగా ఉండే ఆహారం గుండె పోటు ముప్పును తగ్గిస్తుందా అనే అంశాన్ని నిగ్గుతేల్చేందుకు కసరత్తు సాగిస్తున్నారు.