న్యూయార్క్ : ఏడాది వ్యవధిలో రెండోసారి కొవిడ్-19ను జయించిన 104 ఏండ్ల మహిళకు కొలంబియా దవాఖాన వైద్య సిబ్బంది జేజేలు పలికారు. మహమ్మారి నుంచి కోలుకున్న కర్మెన్ హెర్నాండెజ్ను చక్రాల బెడ్పై దవాఖాన కారిడార్ల చుట్టూ తిప్పగా శాన్ రఫేల్ డి తుంజ యూనివర్సిటీ దవాఖాన సిబ్బంది చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. దవాఖానలో 21 రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం ఇటీవల ఆమె డిశ్చార్జి అయ్యారు. హెర్నాండెజ్కు తొలుత గత ఏడాది జూన్లో ఇన్ఫెక్షన్ సోకగా శాంజోస్ నర్సింగ్ హోంలో చికిత్స పొందారు.
ఫిబ్రవరిలో ఆమె వ్యాక్సిన్ తీసుకున్నా గత నెలలో రెండోసారి కొవిడ్ బారినపడ్డారు. ఆపై ఐసీయూలో ఉంచి ఆమెకు చికిత్స అందించారు. హెర్నాండెజ్కు నిర్వహించిన కరోనా పరీక్షలో నెగెటివ్గా రావడంతో సోమవారం ఆమెను దవాఖాన నుంచి డిశ్చార్జి చేశారు. హెర్నాండెజ్ శతాధిక వృద్ధురాలైన అద్భత శారీరక సామర్ధ్యం ఉండటంతోనే రెండో సారి వైరస్ను తట్టుకోగలిగారని దవాఖానాలో పనిచేసే హెల్త్ వర్కర్ గినా గొమెజ్ చెప్పారు, మెరుగైన ఆరోగ్యంతో ఆమె కరోనాను దీటుగా ఎదుర్కొన్నారని అన్నారు. ఆమె కరోనా నుంచి బయటపడటమే కాకుండా స్కిన్ క్యాన్సర్ నుంచి కూడా కోలుకున్నారని దవాఖాన డైరెక్టర్ యమిత్ హర్తాడో చెప్పారు. 1916లో జన్మించిన హెర్నాండెజ్కు 70 ఏండ్ల కుమార్తె ఉన్నారు.