World Cancer Day 2022 | క్యాన్సర్ ఓ భయంకరమైన మహమ్మారి. దీని పేరు వింటే చాలు చాలామందికి కాళ్లు, చేతులు వణికిపోతాయి. ఒక్కసారి ఈ వ్యాధి సోకింది మొదలు చికిత్స పూర్తయ్యే వరకు నరకయాతన అనుభవించాలి. చికిత్స తర్వాత కూడా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చికిత్స తర్వాత కోలుకొని తిరిగి ఆరోగ్యంగా మారాలంటే ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేం. ఇలాంటి భయంకరమైన వ్యాధి ఎలా వస్తుంది? ఈ మహమ్మారిని ఎలా గుర్తిస్తారు? చికిత్స కోసం ఎలాంటి పద్ధతులు ఉన్నాయి వంటి వివరాలను సికింద్రాబాద్లోని రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్లోని డైరెక్టర్ ఆఫ్ చీఫ్ మెడికల్ ఆంకాలజీ సర్వీసెస్ డాక్టర్ పాలంకి సత్య దత్తాత్రేయ వెల్లడించారు. క్యాన్సర్ డే ( ఫిబ్రవరి 4 ) పురస్కరించుకుని ఆయన తెలిపిన సమాచారం ఒకసారి చూద్దాం..
క్యాన్సర్ అంటే ఏంటి? ఇది ఎన్ని రకాలు?
క్యాన్సర్ అనేది శరీరంలోని ఓ అవయవానికి, కణజాలంలో మొదలయ్యే వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా జనాలను బలితీసుకుంటున్న వ్యాధుల్లో క్యాన్సర్ మహమ్మారిది రెండో స్థానం. ఒక్క కణజాలంలో మొదలైన ఈ వ్యాధి అంతకంతకూ పెరుగుతూ శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలను పెంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వందకు పైగా క్యాన్సర్ వ్యాధి రకాలను గుర్తించారు శాస్త్రవేత్తలు. బ్రెస్ట్, లంగ్స్, స్కిన్, త్రోట్, గర్భాశయం, అండాశయం, జీర్ణాశయం, పేగులు, నోటి క్యాన్సర్ ఇలా పలు రకాల క్యాన్సర్లు గుర్తించబడ్డాయి. ఏటా వీటి బారిన పడుతున్న వారి సంఖ్య దాదాపు 13 లక్షలకు పైనే అని ఎన్నో అధ్యయనాలు చెప్తున్నాయి. కొన్ని దశల్లో క్యాన్సర్ ప్రాణాలను సైతం బలి తీసుకుంటూ మానవాళిపై దాడి చేస్తోంది.
క్యాన్సర్ ఎలా వస్తుంది?
పరిమితి మించి కణజాలం విపరీతంగా పెరిగిపోవడాన్నే క్యాన్సర్ అని అంటారు. సాధారణంగా శరీరంలో కణాల విభజన జరుగుతుంది. ఇలా ప్రతి కణం విభజనకు గురై పుడుతూ చనిపోతూ ఉంటాయి. అయితే, శరీరంలో ఈ ప్రక్రియకు విఘాతం ఏర్పడితే కొన్ని కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. కణాల్లో ఉండే డీఎన్ఏలో మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. డీఎన్ఏ వల్ల మన తల్లిదండ్రుల్లో ఉండే లక్షణాలే మనకు కూడా వస్తాయి. అలాగే క్యాన్సర్ కూడా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. ఆహారపు అలవాట్లు, రేడియేషన్, స్మోకింగ్, ఊబకాయం తదితర కారణాల వల్ల కూడా డీఎన్ఏలో మార్పులు వస్తాయి. దీని వల్ల కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. ఫలితంగా శరీరానికి అవసరమైన కణాల కంటే ఎక్కువ వృద్ధి చెందుతాయి. అవన్నీ కలిసి ట్యూమర్గా ఏర్పడతాయి. దాన్నే క్యాన్సర్ అని అంటారు.
ముందు గుర్తిస్తేనే ఫలితం ఎక్కువ
మన దేశంలో క్యాన్సర్ వ్యాధి గురించి, దాని లక్షణాల గురించి ఇప్పటికీ చాలామందికి అవగాహన లేదు. చాలా కేసుల్లో వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత గుర్తిస్తుండటంతో పరిస్థితి చేయి దాటిపోతుంది. ముందుగానే గుర్తిస్తే ఈ మహమ్మారి బారి నుంచి త్వరగా బయటపడే ఛాన్స్ ఉంది. క్యాన్సర్ సోకిన తర్వాత స్టేజ్-1, స్టేజ్-2 లలో గుర్తిస్తే.. దాన్ని నయం చేసే వైద్యం అందుబాటులో ఉంది. ఈ రెండు స్టేజ్లలో గుర్తించి ట్రీట్ మెంట్ తీసుకుంటే దాదాపు 90 శాతం నయమయ్యే అవకాశం ఉంది. స్టేజ్-4లో గుర్తిస్తే వ్యాధి 22 శాతం నయమయ్యే ఛాన్స్ ఉందంది. క్యాన్సర్ను గుర్తించేందుకు ప్రస్తుతం ఎన్నో పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. కచ్చితమైన చికిత్స, వ్యాధి తీవ్రత ఎక్కువ కాకుండా వ్యూహాత్మక చికిత్స విధానాలను అవలంభిస్తుండటంతో క్యాన్సర్కు చెక్ పెడుతున్నారు. వ్యాధి తీవ్రత పెరిగిన వారితో పోలిస్తే ముందుగా గుర్తించిన వారిలో వ్యాధి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాధి తీవ్రత తగ్గడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ను లీడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది.
క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఇవే..
లక్షణాలను బట్టి ఏ క్యాన్సర్ అనేది గుర్తించే పద్ధతులు కనుగొనబడ్డాయి. క్లినికల్, మెడికల్ హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్, ల్యాబరేటరీ టెస్టుల ద్వారా వ్యాధిని నిర్ధారిస్తున్నారు. స్క్రీనింగ్, అల్ట్రా సౌండ్, డిజిటల్ మామోగ్రఫీ, ట్రూ-కట్ బయాప్సీ, ఎంఆర్ఐ, సీటీ స్కాన్, పీఈటీ స్కాన్, ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ వంటి అధునాతన పద్ధతుల ద్వారా క్యాన్సర్ ను గుర్తిస్తున్నారు. వీటితో పాటు ఇమ్యునో హిస్టోకెమిస్ట్రీ, ఇన్ సిటు హైబ్రిడైజేషన్, రియల్ టైమ్ పీసీఆర్, ఫ్లో సైటోమెట్రీ, మైక్రో అరే, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్, లిక్విడ్ బయాప్సీ వంటి పద్ధతులు కూడా క్యాన్సర్ నిర్ధారణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ట్రీట్మెంట్ ఇదీ..
క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత సర్జన్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఇతర వైద్య నిపుణులతో కూడిన మల్టీ డిసిప్లినరీ టీమ్ ద్వారా చికిత్స పొందవచ్చు. క్యాన్సర్ రకం, దాని దశ, రోగి స్టేజ్ను బట్టి చికిత్స విధానాలు ఉన్నాయి. సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సా విధానాలతో క్యాన్సర్ కొంత అదుపులోకి వస్తోంది. సర్జరీ అవసరం లేని చికిత్సతో పాటు.. ఒకవేళ సర్జరీ చేయాల్సి వచ్చినా.. ఎలాంటి నొప్పి, బాధ లేకుండా చేసే చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఏదైనా అవయవానికి క్యాన్సర్ సోకితే ఆ పార్ట్ మొత్తం తీసేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు.. వ్యాధి సోకిన ప్రాంతాన్ని మాత్రమే తీసేసి.. మిగతా ప్రాంతానికి మళ్లీ సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ చికిత్స అందిస్తున్నారు. ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సోకితే రొమ్మును పూర్తిగా తొలగించేవారు. మారిన చికిత్స విధానాలతో ప్రస్తుతం రొమ్మును పూర్తిగా తొలగించకుండా కేవలం క్యాన్సర్ కణతులు ఉన్న ప్రాంతాన్నే సర్జరీ చేసి తీసేసి.. మళ్లీ క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఆపరేషన్లు చేస్తున్నారు. పొత్తి కడుపు క్యాన్సర్ కోసం ఇంకో చికిత్స విధానాన్ని కనుగొన్నారు. రెండు దశల్లో చేసే హైపర్ థెర్మిక్ ఇంట్రా పెరిటోనియల్ కీమో థెరపీ సర్జరీ పొత్తి కడుపులోని క్యాన్సర్ ను సమూలంగా నిర్మూలిస్తోంది. క్యాన్సర్ కణాలను చంపడం, దాని ఎఫెక్ట్ని తగ్గించడంతో పాటు శరీరంపై విష పదార్థాలను తీసేసేందుకు కీమో థెరపీ చేస్తున్నారు. ఈ రకమైన చికిత్సా విధానాలు క్యాన్సర్ ట్రీట్మెంట్లో పెను సంచలనం సృష్టించాయి.
సాధారణంగా క్యాన్సర్ సోకినప్పుడు చాలా రకాల చికిత్స విధానాలు అవసరం అవుతాయి. తక్కువ ఖర్చుతో కూడిన జీన్ సీక్వెన్సింగ్ ద్వారా అందించే చికిత్స మంచి ఫలితం ఇస్తున్నది. కొన్నాళ్లుగా రేడియేషన్ చికిత్స కూడా మంచి పురోగతి సాధిస్తున్నది. శరీరంలోని క్యాన్సర్ కణాలను టార్గెట్ చేసి రేడియేషన్ క్యాన్సర్ కణాలను సమూలంగా తుడిచి పెట్టేస్తోంది. క్యాన్సర్ సోకిన శరీరాన్ని బట్టి డాక్టర్లు ఈ రేడియేషన్ చికిత్స విధానాలను ఎంచుకుంటారు.
కరోనా మహమ్మారి సమయంలో..
కరోనా మహమ్మారి వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఆంకాలజీ సేవలను దెబ్బతీసింది. దీంతో డాక్టర్లు కొత్త మార్గాలను అనుసరించడం ద్వారా పూర్తి సేఫ్టీగా ట్రీట్మెంట్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. టెలీ మెడిసిన్, కౌన్సెలింగ్, మందులను సూచించడం, రిమోట్ మానిటరింగ్ ద్వారా ట్రీట్మెంట్ చేసే మార్గాలను కనుగొన్నారు. చికిత్స కోసం ప్రతిసారి హాస్పిటళ్లకు వచ్చే అవసరం లేకుండా ట్యాబ్లెట్స్ వేసుకోవడం ద్వారా రోగి సేఫ్టీగా ఉండే విధానాలను అనుసరిస్తున్నారు. కరోనా కాలంలోనూ చికిత్సా విధానంలో కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. దీంతో ప్రస్తుతం క్యాన్సర్ కంట్రోల్లోనే ఉన్నా.. రాబోయే కాలంలో అంతా కలిసికట్టుగా ఉంటే క్యాన్సర్పై విజయం సాధించవచ్చు.