Pregnant | నెలలు నిండుతున్నకొద్దీ గర్భిణిలో ఆందోళన. అనేకానేక భయాలు. తొలి నుంచే రోజూ ఓ ఇరవై నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా.. ఆందోళనను అధిగమించవచ్చని, సుఖ ప్రసవం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ధ్యానం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ల ఉత్పత్తి అధికం అవుతుంది. గర్భిణికి నొప్పిని తట్టుకునే శక్తి వస్తుంది. ఒత్తిడికి ధ్యానం తిరుగులేని పరిష్కారం. ఎందుకంటే.. ఒత్తిడి కారణంగా అడ్రినలిన్, కార్టిసోల్ మొదలైన స్ట్రెస్ హార్మోన్లు విడుదల అవుతాయి. దీంతో కాబోయే అమ్మలు అధిక రక్తపోటుకు గురవుతారు. రక్తంలో చక్కెర శాతం అధికం అవుతుంది. తాత్కాలిక మధు మేహమూ రావచ్చు. ధ్యానంలో భాగమైన దీర్ఘశ్వాస ప్రభావంతో ఒత్తిడి తగ్గుతుంది. హార్మోన్లు హద్దులో ఉంటాయి.
నిత్య ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. కలతలేని నిద్ర సాధ్యం అవుతుంది. ఫలితంగా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. తల్లిలో పాల ఉత్పత్తి అధికం అవుతుంది. ప్రసవానంతర డిప్రెషన్ దరిదాపుల్లోకి కూడా రాదు. గర్భిణులను ప్రీక్లాంప్సియా అనే సమస్య కూడా ఇబ్బంది పెడుతుంది. ఈ సమయంలో శరీరంలోని ప్రొటీన్ మూత్రంతోపాటు వెళ్లిపోతుంది. దీంతో ప్రొటీన్ కొరత ఏర్పడుతుంది. అనేకానేక దుష్ఫలితాలు వెంటాడతాయి. ధ్యానం రక్తపోటును, గుండె స్పందనలను తగ్గిస్తుంది. ఇంకే ముంది, ప్రీక్లాంప్సియా ముప్పు తప్పుతుంది.