సూపర్ స్పెషాలిటీ సేవలంటే ఇప్పటికీ గాంధీ, ఉస్మానియా, నిమ్స్ దవాఖానలే దిక్కు. దీంతో ఆయా దవాఖానలపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సూపర్ స్పెషాలిటీ సేవలను పెంచాలని, అత్యాధునిక సదుపాయాలు కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్) పేరుతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొదట గచ్చిబౌలిలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను తీర్చిదిద్దింది. కరోనా సమయంలో ఈ దవాఖాన ఉత్తమ సేవలు అందించింది. సూపర్ స్పెషాలిటీ సేవల కోసం టిమ్స్ను ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్ 26న అల్వాల్, గడ్డి అన్నారం, ఎర్రగడ్డ ప్రాంతాల్లో టిమ్స్ నిర్మాణాలకు సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు.
ఇవి ఎయిమ్స్ మాదిరి స్వయం ప్రతిపత్తి గల వైద్య విజ్ఞాన సంస్థలుగా సేవలందిస్తాయి. ఇందులో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీలలో వైద్య విద్య, 16 స్పెషాలిటీ, 15 సూపర్ స్పెషాలిటీలలో పీజీ కోర్సులు, సూపర్ స్పెషాలిటీలలో నర్సింగ్, పారామెడికల్ విద్య, 30 డిపార్ట్మెంట్లు, గుండె, కిడ్నీ, లివర్, మెదడు, ఊపిరితిత్తుల విభాగాలు, కాన్సర్ సేవలు, ట్రామా సేవలు, ఎండోక్రైనాలజీ విభాగాలు, ఎలర్జీ, రుమటాలజీ విభాగాలు, వ్యాధి నిర్ధారణ విభాగాలు ఉంటాయి. 200 మంది బోధన సిబ్బంది పనిచేస్తారు. 500 మంది వరకు రెసిడెంట్ డాక్టర్లు ఉంటారు.
26 ఆపరేషన్ థియేటర్లు, క్యాథ్ ల్యాబ్ సేవలు, డయాలసిస్ సేవలు, కాన్సర్ రేడియేషన్, కీమోథెరపీ, సిటీ సాన్ ఎంఆర్ఐ వంటి సేవలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఒక్కో దవాఖానలో వెయ్యి పడకలకు ఆక్సిజన్ సరఫరా ఉంటుంది. వీటిలో 300 ఐసీయూ పడకలు ఉండనున్నాయి. ఫ్యాకల్టీ, రెసిడెంట్లకు అక్కడే క్వార్టర్స్ ఉంటాయి. ఆల్వాల్లో 28.41 ఎకరాల్లో రూ.897 కోట్ల ఖర్చుతో, గడ్డి అన్నారంలో 21.36 ఎకరాల్లో రూ.900 కోట్ల ఖర్చుతో, ఎర్రగడ్డలో రూ.882 కోట్ల ఖర్చుతో ఈ సూపర్ స్పెషాలిటీ దవాఖానలను నిర్మిస్తున్నారు. వీటికితోడు వరంగల్ హెల్త్ సిటీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మిస్తున్నారు. నిమ్స్లో అదనంగా 2 వేల సూపర్ స్పెషాలిటీ పడకలను విస్తరిస్తున్నారు. వీటన్నింటికీ గతేడాది సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ పనులు కొనసాగుతున్నాయి. వరగంల్ హెల్త్ సిటీని దసరా నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. ఇవన్నీ పూర్తయితే 8,200 సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి వస్తాయి.
వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
వరంగల్లో అత్యాధునిక సౌకర్యాలతో రూ. 1200 కోట్ల వ్యయంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు 2021 జూన్లో భూమి పూజ చేశారు. 59 ఎకరాల్లో ఈ దవాఖాన నిర్మాణం జరుగుతున్నది. 24 అంతస్తులతో రూపుదిద్దుకుంటున్న ఈ భవనంలో 34 విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందిస్తారు.
అత్యాధునిక ఎంసీహెచ్లు
మాతాశిశు సంరక్షణలో భాగంగా కేవలం గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంసీహెచ్లను ఏర్పాటు చేస్తున్నది. రూ.407 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 22 ఎంసీహెచ్లను ఏర్పాటు చేసింది. వీటిద్వారా గర్భిణులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. గాంధీ దవాఖానలో అత్యాధునిక ఎంసీహెచ్ పనులు చివరి దశలో ఉన్నాయి. మరోవైపు నిమ్స్ విస్తరణకు అదనంగా 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ను నిర్మించనున్నారు. ఈ పనులకు ఇటీవలే మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం నిమ్స్లో గైనకాలజీ విభాగం సేవలు అందుబాటులో లేవు. ప్రసవాలు కూడా జరగడం లేదు. ఎంసీహెచ్ నిర్మాణంతో ఈ విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎంసీహెచ్ నిర్మాణానికి రూ.55 కోట్లు వెచ్చించనున్నారు. నాలుగు అంతస్తుల్లో నిర్మిస్తారు. భవిష్యత్తులో 8 అంతస్తులకు పెంచుకొని ప్రత్యేక బ్లాక్గా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
నాలుగు టిమ్స్ – 4,200
వరంగల్ హెల్త్ సిటీ – 2000
నిమ్స్ విస్తరణ – 2000
మొత్తం – 8,200