ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇష్టమైన పండ్లలో మామిడి ఒకటి. దాని తీపి రుచి, ప్రకాశవంతమైన రంగు మనకు నోరూరేలా చేస్తుంది. అందుకే మామిడి పండును పండ్లకు రాజు అని కూడా పిలుస్తారు. ఆసియా, ఆఫ్రికా, మధ్య అమెరికాలో ఎక్కువగా లభిస్తుంది. మామిడిలో సహజమైన చక్కెర ఉంటుంది. దీంతో మామిడిపండు చాలా తియ్యగా ఉంటుంది. ఇందువల్ల మధుమేహంతో బాధపడేవారు పండ్ల చక్కెరలు, అధిక కేలరీల గురించి ఆందోళన చెందుతారు. దీంతో మామిడిపండు తినేందుకు జంకుతారు.
మామిడిపండ్లలో వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి, ఇందులో మెగ్నీషియం, కాల్షియం, భాస్వరం, ఐరన్, జింక్ ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్..కార్బొహైడ్రేట్స్ ప్రభావాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతాయని నిపుణులు నమ్ముతారు. మామిడి గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) 51. ఇది సాంకేతికంగా తక్కువ జీఐ ఆహారంగా వర్గీకరించబడింది.
డయాబెటిస్ రోగులు మామిపడి పండును తినొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఈ కింది రెండు పద్ధతులు పాటించాలని చెబుతున్నారు.
నిర్దిష్ట మొత్తం తీసుకోవాలి..
మనం ఏది తిన్నా దాన్ని నిర్దిష్ట మొత్తానికి పరిమితం చేస్తే దానితో అనేక లాభాలుంటాయి. ఇదే సూత్రం మామిడిపండుకు కూడా వర్తిస్తుంది. రోజులో ఒక వ్యక్తి 15 గ్రా. కార్బొహైడ్రేట్స్ తీసుకోవచ్చు. సగం కప్పు మామిడిపండు ముక్కలు 12.5 గ్రా కార్బొహైడ్రేట్ను అందిస్తుంది. అందువల్ల మధుమేహులు రోజులో సగం కప్పు మామిడిపండు ముక్కలను అనుమానం లేకుండా తినొచ్చు.
ఆహార సమతుల్యత పాటించాలి..
రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు మామిడి పండ్ల రుచిని ఆస్వాదించేందుకు ఆహార సమతుల్యత పాటించాలి. మామిడి పండ్లను చియా సీడ్ పుడ్డింగ్లో చేర్చవచ్చు. లేదా కొన్ని రకాల గింజలలతో కలిపి మామిడి పండును కూడా తీసుకోవచ్చు.