Health tips: చాలా మందికి చపాతి, పరోట, రుమాలీ రోటి, తందూరీ రోటి వంటి వాటిని చూడగానే నోరూరుతుంది. గోధుమ పిండితో తయారు చేసినవే అయితే వాటిని తినడంవల్ల ఆరోగ్యానికి వచ్చే ముప్పేమీ లేదు. కానీ, అవి మైదాతో తయారైనవి అయితే మాత్రం కోరికోరి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్టేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైదాతో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మైదా పిండి మెత్తదనం, తెల్లదనం కోసం అధికంగా పాలిష్ చేస్తారు. క్లోరైడ్ గ్యాస్, బెంజయిల్ పెరాక్సైడ్ లాంటి రసాయనాలను మిక్స్ చేస్తారు. అంతేగాక మైదాలో అల్లోక్సాన్ అనే విషపూరితమైన రసాయనం కూడా ఉంటుంది. ఈ రసాయనాలు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయంటున్నారు నిపుణులు…
మైదాతో వచ్చే అనర్థాలివే..
మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా ఎంతోకొంత పీచు పదార్థం ఉండాలి. కానీ మైదాలో పీచుపదార్థం జీరో. కాబట్టి మైదా త్వరగా జీర్ణం కాకుండా పేగుల్లో పేరుకుపోతుంది. దీనివల్ల పేగుల్లో పుండ్లు పడే ప్రమాదం ఉన్నది. అవి ముదిరితే క్యాన్సర్ లాంటి తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయి.
మైదా పిండిని గోడలకు పోస్టర్లను అంటించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే మైదాపిండిలోని జిగురు పోస్టర్లు గోడకు గట్టిగా అంటుకునేలా చేస్తుంది. మైదాతో చేసిన పదార్థాలను తిన్నప్పుడు అవి మన పేగులకు కూడా అలాగే అతుక్కుపోతాయి. దాంతో వాటిలో క్రిములు ఉత్పత్తై ఇన్ఫెక్షన్లను కలుగజేస్తాయి.
మైదా పిండివల్ల కిడ్నీల్లో రాళ్లు కూడా ఏర్పడతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది. మహిళలల్లో బ్రెస్ట్ సంబంధ సమస్యలు ఉత్పన్నమవుతాయి. మైదాలో కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండటంవల్ల పొట్ట వస్తుంది. ప్రొటీన్లు కూడా నామమాత్రంగా ఉంటాయి. మైదాలో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఒంట్లో షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంది.