Kidney Diseases | ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల (కిడ్నీ) వ్యాధులతో బాధపడే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. మన దేశంలో సుమారు 115 నుంచి 138 మిలియన్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. చైనా తర్వాత అత్యధిక కేసులు భారత్లోనే నమోదవుతున్నాయి. Chronic Kidney Disease (CKD) గా పిలిచే ఈ వ్యాధిలో మూత్రపిండాలు దెబ్బతినడం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థాలు, ద్రవాలను సరిగా ఫిల్టర్ చేయలేవు. అలాగే ఈ వ్యాధికి ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. రక్త పరీక్షలు, మూత్ర పరీక్షల ద్వారానే దీనిని గుర్తించగలం. అయితే ప్రారంభంలో గుర్తించకపోతే చివరకు డయాలిసిస్ లేదా కిడ్నీ మార్పిడి చేయాల్సిన పరిస్థితి నెలకొంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మూత్రపిండాల వ్యాధులకు ప్రధాన కారణాలు అధిక రక్తపోటు, అధిక రక్త చక్కెర స్థాయిలే. అయితే వైద్య నిపుణులు చెబుతున్న మరో ముఖ్య కారణం సెల్ఫ్ మెడికేషన్ (స్వయంగా మందులు వాడటం). భారతదేశంలో ఆరోగ్యంపై నిర్లక్ష్య ధోరణి ఎక్కువగా ఉందని, చాలామంది తమ ఆరోగ్యంపై సరైన శ్రద్ధ చూపకపోవడం వల్ల స్వయంగా మందులు వాడే అలవాటు పెరిగిందని వైద్యులు పేర్కొంటున్నారు.
సెల్ఫ్ మెడికేషన్ అంటే, వైద్యుడి సలహా లేకుండా తాము అనుమానించిన లక్షణాల ఆధారంగా మందులు వాడటం. ఇది కొన్నిసార్లు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినా, దీని వల్ల ఔషధాలకు ప్రతిరోధం, దుష్ప్రభావాలు, మందుల పరస్పర ప్రతిక్రియలు, తీవ్రమైన పరిస్థితుల్లో ప్రాణాపాయం కూడా కలగొచ్చు. భారత్లో ఈ అలవాటు 8.3 శాతం నుంచి 92 శాతం వరకు ఉన్నట్లు అంచనా. సెల్ఫ్ మెడికేషన్ పెరగడానికి కొన్ని ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి. మొదటిగా, నియంత్రణ నిబంధనలను సరైన విధంగా అమలు చేయకపోవడం, అవినీతి వంటి అంశాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయి. తప్పుడు ప్రచారాలు, అబద్ధపు శాస్త్రీయ వాదనలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. రెండవది, దేశంలో సమగ్ర ఆరోగ్య బీమా లేకపోవడం వల్ల చాలామంది వైద్యులను సంప్రదించకుండా ఖర్చు తగ్గించుకోవడానికి స్వయంగా మందులు వాడుతున్నారు. మూడవది, ఓవర్-ది-కౌంటర్ మందులు సులభంగా లభించడం వల్ల ఎవరైనా సులభంగా మందులు కొనుగోలు చేసి వాడుతున్నారు. ఈ సందర్భాల్లో ఫార్మసీ వారు లేదా పరిచయస్తులే సలహా ఇస్తుంటారు.
ఇక కిడ్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపే మందుల్లో ముఖ్యంగా నొప్పి నివారణ మందులు (NSAIDs), యాంటీబయాటిక్స్ ఉంటాయి. Diclofenac, Ketorolac వంటి మందులు కిడ్నీలకు రక్త ప్రవాహాన్ని తగ్గించి ఆకస్మిక కిడ్నీ గాయానికి దారితీస్తాయి. దీర్ఘకాలంగా వాడితే ఇది క్రానిక్ కిడ్నీ వ్యాధిగా మారే ప్రమాదం ఉంది. అలాగే Azithromycin వంటి యాంటీబయాటిక్స్ను సాధారణ జలుబు కోసం ఎక్కువగా వాడటం వల్ల అరుదుగా కిడ్నీలలో ఇన్ఫ్లమేషన్ సమస్యలు తలెత్తవచ్చు. వీటితో పాటు సంప్రదాయ ఔషధాల విషయంలో కూడా జాగ్రత్త అవసరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాటిలో ఉండే పదార్థాల గురించి పూర్తి సమాచారం లేకపోవడం వల్ల అవి కిడ్నీలపై ఎలా ప్రభావం చూపుతాయో తెలియదు. అయినప్పటికీ చాలా మంది వాటిపై అతి విశ్వాసం ఉంచుతున్నారని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం ప్రమాదకరం. సరైన పోషకాహారం తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం, ఏదైనా సమస్య ఉంటే నిపుణుల సలహా తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యంపై నిర్లక్ష్యం ప్రాణాంతక పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.