Kidney Health | హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): మారుతున్న జీవనశైలి కారణంగా మూత్రపిండాల వ్యాధులు ఎక్కువ మందిని పీడిస్తున్నాయి. మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటైన ఈ మూత్రపిండాలు నిరంతరం పనిచేస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి. కానీ ఇటీవల కిడ్నీ వ్యాధులు పెరుగుతున్నాయని, ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్టు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బీపీ, షుగర్ వంటి వ్యాధులున్న వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటున్నది. మూత్రపిండ వ్యాధులతో దీర్ఘకాలం జీవించడం అతిపెద్ద సవాల్. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు తరచూ వాటి పనితీరును విశ్లేషించుకోవాలి. అవి ఆరోగ్యంగా ఉన్నాయో లేదో పరీక్ష చేయించుకోవాలి. ఏవైనా సమస్యలు ఉన్నట్టు తేలితే వెంటనే చికిత్స పొందాలి. తాజాగా జరిగిన ‘ప్రపంచ కిడ్నీ డే’ సందర్భంగా కిడ్నీల ఆరోగ్యంపై అవగాహన పెంచడాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు.
రక్తపోటు (బీపీ) : అధిక రక్తపోటు మూత్రపిండాల గ్లోమర్యులస్ను (చిన్న ధమనులను) దెబ్బతీస్తుంది. మధుమేహం కూడా మూత్రపిండాలు విఫలం కావడానికి కారణం అవుతాయి. బీపీ 120/80 ఉండటం ఉత్తమం. ఎట్టి పరిస్థితుల్లోనూ 140/90 కంటే తకువగా ఉండాలి. ఒకవేళ మూత్రపిండ వ్యాధులు ఉంటే 130 కన్నా దిగువకు ఉండాలి.
మూత్ర పరీక్ష : మూత్రంలో అల్బుమిన్ జాడలు ఉండటం మూత్రపిండ వ్యాధికి సంకేతం. అల్బుమిన్, క్రియాటినిన్ నిష్పత్తి 30 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉండాలి.
గ్లోమర్యులస్ : చిన్న ధమనుల వడపోత రేటు (జీఎఫ్ఆర్), కిడ్నీ పనితీరు పరీక్ష (కేఎఫ్టీ) కిడ్నీల పనితీరును అంచనా వేస్తాయి. ఈ పరీక్షలు మూత్రపిండాలు రక్తాన్ని ఎంత ప్రభావవంతంగా ఫిల్టర్ చేస్తున్నాయో చెప్తాయి. జీఎఫ్ఆర్ పరీక్షలో సోరు 90 కంటే ఎకువ ఉంటే మంచిది. అంతకన్నా తగ్గినా కొద్దీ కిడ్నీ వ్యాధులు మొదలైనట్టే లెక్క. 15 కన్నా తగ్గితే డయాలసిస్ చేయాల్సి ఉంటుంది.
కిడ్నీ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించాలి. ప్రతి పది మందిలో ఒకరు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ ఉన్నవారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు, బీపీ ఉన్నవారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు కిడ్నీ సమస్యల బారిన పడుతున్నా రు. అందుకే కిడ్నీల పనితీరును తరుచూ పర్యవేక్షించాలి. మనిషి ఒక్క కిడ్నీతో అయినా బతకవచ్చు. కిడ్నీల దానంపై అవగాహన పెరగాలి.
– డాక్టర్ కమల్కిరణ్, నెఫ్రాలజీ విభాగం డైరెక్టర్, మెడికవర్ హాస్పిటల్స్