Kidney Disease Symptoms | కిడ్నీ వ్యాధి చాలా సార్లు నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. అందుకే దీనిని నిశ్శబ్ద వ్యాధిగా కూడా పిలుస్తారు. ముఖ్యంగా అధిక రక్తపోటు (High Blood Pressure) లేదా మధుమేహం ( Diabetes) ఉన్న కోట్లాది మంది వ్యక్తుల్లో కిడ్నీ నష్టం ప్రమాదం కాలక్రమేణా పెరుగుతుంది. అయితే చాలా మంది ఈ సమస్యను గుర్తించలేకపోతారు. ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి (CKD)కి ప్రధాన కారణాలను వైద్యులు తెలియజేస్తున్నారు. తాజా పరిశోధనల ప్రకారం 35 ఏళ్లలోపు హైపర్టెన్షన్ వచ్చినవారిలో కిడ్నీ వ్యాధి ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది. కిడ్నీలు రక్తంలోని వ్యర్థాలను, అదనపు ద్రవాలను వడపోసే చిన్న రక్తనాళాలతో నిర్మితమై ఉంటాయి. రక్తపోటు ఎక్కువకాలం ఎక్కువగా ఉంటే, ఈ సున్నితమైన రక్తనాళాలు దెబ్బతింటాయి. కాలక్రమేణా ఈ నష్టం కిడ్నీల పనితీరును తగ్గిస్తుంది. అయితే ఈ మార్పులు నెమ్మదిగా జరుగుతాయి కాబట్టి ప్రారంభ దశలో లక్షణాలు కనిపించవు. శరీరం కూడా ఈ మార్పులకు కొంతకాలం అలవాటు పడుతుంది.
అదేవిధంగా డయాబెటిస్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అధిక గ్లూకోజ్ కారణంగా కిడ్నీలు ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. దీని వల్ల గ్లోమెరులీ అనే వడపోత యూనిట్లు దెబ్బతింటాయి. ఈ పరిస్థితిని డయాబెటిక్ నెఫ్రోపతి అని పిలుస్తారు. ఇది పెద్దల్లో కిడ్నీ ఫెయిల్యూర్కు ముఖ్య కారణంగా నిలుస్తోంది. పరిశోధనలు చెబుతున్నట్లుగా డయాబెటిస్ ఉన్న వారిలో దాదాపు 40 శాతం మందికి అల్బ్యూమిన్ స్థాయిలు సాధారణంగా ఉన్నప్పటికీ కిడ్నీ పనితీరు తగ్గిపోతూ ఉంటుంది. కిడ్నీలు దెబ్బతిన్నప్పటికీ మిగిలిన ఆరోగ్యకరమైన భాగం కొంతకాలం పనిని నిర్వహిస్తుంది. అందువల్ల లక్షణాలు ఆలస్యంగా మాత్రమే బయటపడతాయి. ఎక్కువగా రక్తం లేదా మూత్ర పరీక్షలు చేసినప్పుడు మాత్రమే ఈ వ్యాధి గుర్తించబడుతుంది. కిడ్నీ వ్యాధి ముదిరిన తర్వాత కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపించవచ్చు. కాళ్లు, మోకాళ్లు లేదా చేతుల్లో వాపు, అలసట, రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన, చర్మంలో దురద, ఏకాగ్రత లోపం వంటి లక్షణాలు ఉండవచ్చు. అయితే ఇవి సాధారణ సమస్యలుగా భావించి చాలామంది నిర్లక్ష్యం చేస్తారు.
అధిక రక్తపోటు లేదా డయాబెటిస్ ఉన్నవారు నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. కిడ్నీ పనితీరును తెలుసుకోవడానికి రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు చేయిస్తారు. మూత్రంలో ప్రోటీన్ లీకేజీ కనిపించడం కిడ్నీ నష్టానికి ప్రారంభ సంకేతం కావచ్చు. ప్రారంభ దశలో కిడ్నీ వ్యాధిని గుర్తిస్తే ఔషధాలు, జీవనశైలి మార్పులు, రక్తపోటు, చక్కెర నియంత్రణ ద్వారా వ్యాధి పురోగతిని తగ్గించవచ్చు. సరైన ఆహారం తీసుకోవడం, ఉప్పు వినియోగాన్ని తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, అవసరం లేని మందులు వాడకపోవడం కిడ్నీ ఆరోగ్యానికి సహాయపడుతుంది. అధిక రక్తపోటు, డయాబెటిస్ కారణంగా వచ్చే కిడ్నీ వ్యాధి ప్రారంభ దశలో పెద్దగా లక్షణాలు చూపదు. అందుకే ఇది చాలా ప్రమాదకరంగా మారుతుంది. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.