Cucumber | నాగర్కర్నూల్, మార్చి 18 : కీర దోస.. దీనికున్న క్రేజీ అంతాఇంతా కాదు.. కాయను కోసి కాస్త ఉప్పుకారం చల్లి తింటుంటే ఆ మజానే వేరు.. కిలో రూ.20 నుంచి రూ.25కు లభిస్తుంది. ఆరోగ్యానికి భరోసానిస్తుండడం.. తక్కువ నీరు.. సమయంలో చేతికొచ్చే ఈ పంట సాగుతో లాభాలు బాగుంటున్నాయి. మంచి ఆదాయం ఉన్న పంట కావడంతో సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. మనిషిలో కొవ్వుని తగ్గించే గుణం.. ‘సి’ విటమిన్ పుష్కలంగా ఉండడం.. బీపీని అదుపు చేయడంలో దివ్యౌషధంగా పనిచేస్తున్నది. వేసవిలో చల్లదనాన్నిస్తూ మేలు చేస్తున్నది. రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం.. అందుకే కీరను తీసుకోవాలని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కీరదోస మెరుగైన ఆరోగ్యానికి చక్కటి దివ్యౌషధం. దోసకాయను ఆహారంలో భాగం చేసుకుంటే తినే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ప్రస్తుత వేసవిలో చల్లదనాన్ని ఇవ్వడమే కాకుం డా పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కీరదోస డీహైడ్రేటింగ్ ఏజెంట్గా పనిచేస్తున్నది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండడంతో రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం కూడా. చెమటతో కోల్పోయిన నీటిని లవణాలను శరీరానికి అందించడంలో చక్కటి పాత్ర పోషిస్తున్నది. రోజూ కప్పు కీరదోస రసం తాగితే శరీరం నిగారింపు సంతరించుకుంటుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతారు.
ఏకాలంలో అయినా అతి తక్కువ ధరకు లభించే కాయల్లో కీరదోస ఒకటి. వేసవి తాపం నుంచి మనిషికి ఉపశమనం కలిగించడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తున్నది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో తోపుడు బండ్లపై వీటిని ఎక్కువగా విక్రయిస్తుంటారు. కాయను కోసి కాస్త ఉప్పుకారం చల్లి తింటుంటే ఆ మజానే వేరు.. కిలోకు రూ.20 నుంచి రూ.25కు లభిస్తుంది. ఎక్కువగా శుభకార్యాలు, పెం డ్లిండ్ల సమయంలో కాస్త ధర ఎక్కువగా ఉంటుంది.