డయేరియా.. వానకాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే రుగ్మత. నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం ఈ సమస్యకు ప్రధాన కారణం. దీనివల్ల ఒక్కసారిగా మనిషి నీరసపడిపోతాడు. ప్రయాణంలో ఉన్నప్పుడైతే నరకమే. దీనికి విరుగుడు పెరుగే. పెరుగులో ఉన్నన్ని ఔషధ గుణాలు ఎందులోనూ ఉండవేమో! అది ప్రోబయాటిక్ పదార్థం కూడా. డయేరియాతో బాధపడుతున్నవారికి పెరుగు తిరుగులేని మందు. నేరుగా తీసుకున్నా మంచిదే. ఇందులోని సూక్ష్మ పోషకాలు సమర్థంగా పనిచేసి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి.
పెరుగులో అల్లం పేస్ట్ కలుపుకొని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పరిశుభ్రం అవుతుంది. పెరుగులో బియ్యపు గంజి కలిపి తాగితే.. శరీరానికి తక్షణం హైడ్రేషన్ వస్తుంది. కాసిన్ని వేయించిన మెంతులు, జీలకర్ర పొడిచేసి.. పెరుగుతోపాటు తీసుకుంటే చిన్నాచితకా ఇన్ఫెక్షన్లు ఉన్నా వదిలిపోతాయి.