పగటి నిద్ర పనికి చేటు అంటారు. కానీ పగటి కునుకు శరీరానికి, మెదడుకు ఎంతో మంచిచేస్తుందట. అలా ఓ గంటన్నర వరకు కునుకు తీయొచ్చని చెబుతున్నారు నిపుణులు. కాకపోతే అది రెండు గంటలకు మించితే మాత్రం మగతగా మారుతుంది. అయితే, గంటన్నర సేపు నిద్రపోయేకంటే ఓ పదీపదిహేను నిమిషాలు కునుకు తీస్తే ఇంకా మంచిదట. దీనివల్ల మెదడు, శరీరం రిఫ్రెష్ కావడంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి సామర్థ్యం, మూడ్ కూడా మెరుగుపడతాయట. అంతేకాదు, కునుకు మనలోని మగతను దూరం చేసి.. చురుగ్గా మార్చేస్తుంది. కాకపోతే, పగటి కునుకు ఎప్పుడు పడితే అప్పుడు తీయకుండా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య అయితే ప్రభావవంతంగా ఉంటుంది. మరి, పగటి కునుకు మంచిది అంటున్నారు కదా అని.. పొట్ట నిండా తినేసి నిద్ర పోకూడదు. దీనివల్ల శరీరానికి చెడు జరుగుతుంది.
మధ్యాహ్నం నిద్రతో ఒళ్లు చేస్తుందని భయపడుతుంటారు చాలామంది. కానీ లావుకు, పగటి కునుకుకూ ఏమాత్రం సంబంధం లేదు. అయితే, కడుపు నిండా తిన్న వెంటనే నిద్రపోతే మాత్రం ఊబకాయం ముప్పు తప్పదు. దీనివల్ల జీర్ణక్రియలో ఆటంకాలు ఏర్పడతాయి. పొట్టలో ఆమ్లం పైకి తన్నుకొస్తుంది (యాసిడ్ రీఫ్లక్స్). పడుకున్నప్పుడు శరీరంలో కేలరీలు తక్కువగా ఖర్చవుతాయి. పైగా కొవ్వులు కూడా తక్కువగా కరుగుతాయి. కాబట్టి భోజనం, నిద్రకు మధ్య గంట నుంచి రెండు గంటల విరామం ఉంటే మంచిదని నిపుణుల సూచన.