Health Tips | కొత్త సంవత్సరం వచ్చేసింది. అంటే, ఒక ఏడాది వెళ్లిపోయినట్టే. ఎంతోకొంత కాలం చేజారినట్టే. ఈసారి మాత్రం అలాంటి పొరపాటు జరగనివ్వను.ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే… వయసు పెరగదని, అవయవాలు అలసిపోవని, మనసు ప్రశాంతంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.అందుకే ఈ ఏడాది కొన్ని నియమాలు పాటించి తీరాలని నిశ్చయించుకున్నాను. ఇది నాకు నేను చెప్పుకొంటున్న ప్రతిజ్ఞ!
తెల్లవారుజామునే మేల్కొనడం మంచిదని చిన్నప్పటి నుంచీ వింటూనే ఉన్నాం.‘రేపటి నుంచి పొద్దున్నే లేవడం మొదలుపెడదాం’ అనుకుంటూనే దశాబ్దాలు దాటేశాం. ఉదయమే నిద్రలేవడం వల్ల మన జీవ గడియారం సమర్థంగా పనిచేస్తుందని, హార్మోన్ల పనితీరు మెరుగ్గా ఉంటుందని.. మొత్తంగా అది మన మానసిక, శారీరక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందనీ ఎలా మర్చి పోగలం? పైగా ఉదయాన్నే ఆరుబయట నాలుగు అడుగులు వేస్తే, ఆ రోజుకు కావాల్సిన విటమిన్-డి దక్కు తుంది. ఇక మీదట సూర్యోదయానికి ముందే లేస్తాను.
పండ్లు తోముకోవడమే ఆలస్యం. ఎప్పుడెప్పుడు టిఫిన్ చేద్దామా, లంచ్ తిందామా అని మనసు తెగ తాపత్రయపడిపోతుంది. ఇక మీదట బ్రేక్- ఫాస్ట్… అంటే ఉపవాసాన్ని విరమించడం అనే మాటకు కట్టుబడి ఉంటాను. అది కూడా తేలికగా జీర్ణమయ్యే దినుసులతో, ఆ రోజుకు అవసరమైన పోషకాలు అందే అల్పాహారాన్ని మాత్రమే తీసుకుంటాను. మొలకెత్తిన విత్తనాలు, పండ్లు తినడానికి ఇది అనువైన సమయమని గుర్తుంచుకుంటాను.
మొబైల్ ఫోన్స్ నుంచి వెలువడే రేడియేషన్ ఎంతో కొంత ప్రమాదకరమే. ఆ వెలుగు వల్ల మన కళ్లు, హార్మోన్లు ప్రభావితం అవుతాయి. అందులోనూ నీలిరంగు మన నిద్రను, మెలకువను నియంత్రించే ‘మెలటోనిన్’ అనే రసాయనాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి నిద్రకు ముందు, నిద్రతర్వాత కనీసం గంట వరకూ మొబైల్ ఫోన్ చూడకూడదన్న నిపుణుల సూచనను ఇక నుంచి పాటించి తీరతాను. రీల్స్ చూస్తూ నిద్రపోవడం, లేస్తూనే మెయిల్స్ చెక్ చేసుకోవడం పూర్తిగా బంద్! పుస్తక పఠనం, చదరంగం, పదకేళి నింపడం.. తదితర వ్యాపకాలకు కొంత సమయం కేటాయిస్తాను.
రోజుకు ఒక్కపూటైనా ఆహారంలో సలాడ్స్ ఉండాలని కచ్చితంగా చెబుతారు పోషకాహార నిపుణులు. పచ్చి ఆహారంతో పీచుపదార్థం అందుతుంది, జీర్ణవ్యవస్థ మెరుగు పడుతుంది, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి, శరీరం పోషకాలను సమర్థంగా గ్రహిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఒంట్లోని రసాయనాలు సమతుల్యంగా ఉండాలంటే సలాడ్ తప్పనిసరి. ఇక మీదట నా మెనూలో సలాడ్ ఉండి తీరుతుంది! కొన్ని పదార్థాలను పచ్చిగా కాకుండా ఉడికించి తినడమే మేలని నిపుణులు వివరిస్తారు. ఆ హెచ్చరికను కూడా దృష్టిలో ఉంచుకుంటాను.
శరీరంలో పెద్దగా కదలికలు లేని అపసవ్య జీవనశైలి ప్రమాదకరం. శరీరానికి కాస్తంతైనా వ్యాయామం లేకపోతే ఎలా? ఇక నుంచి కనీసం వారానికి నాలుగు రోజులు 45 నిమిషాల పాటు ఏదో ఓ కసరత్తు చేస్తాను. మిగతా రోజుల్లో వాకింగ్ వెళ్లే ప్రయత్నమైనా చేస్తాను. ఈ కదలికల వల్ల ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుందని, జీవక్రియలు చురుగ్గా సాగుతాయని, ఎండార్ఫిన్ హార్మోన్ల తీరు మెరుగై మనసు తేలికపడుతుందని, మెదడు మరింత చురుగ్గా మారుతుందని… ఇంకా చాలా లాభాలు ఉంటాయనీ నాకు తెలుసు. ఇక మీదట వ్యాయామం నా జీవితంలో భాగం కావాల్సిందే!
ఆహారం తిరుగులేని ఔషధమని పెద్దలు చెబుతూనే ఉంటారు. జీర్ణక్రియ మన నాలుక నుంచే మొదలవుతుందని నాకు తెలుసు. మరి, అన్యమనస్కంగా తినడం ఎందుకు? అదేదో కాలక్షేపంలా, టీవీ చూస్తూ ఆరగించడం ఎందుకు? ఆహారాన్ని నిదానంగా నమిలి మింగితేనే తేలికగా జీర్ణం అవుతుంది, రుచినీ ఆస్వాదించగలం. ఇక నుంచి అవసరానికి మించి తినను కూడా. వేళాపాళా లేని ఆహారం, టీవీ చూస్తూనో కబుర్లు చెప్పుకొంటూనో చేసే భోజనం విషంతో సమానం. ఈ ఏడాది ఎంతో ఎరుకతో తింటాను.
నా గొణుగుడు తట్టుకోలేక ఇప్పటికే మా ఇంట్లో వంటల్లో ఉప్పు ఎక్కువే వేస్తారు. అయినా నాకు సరిపోదు. తింటున్నప్పుడు పక్కనే ఉప్పు పాత్ర పెట్టుకుంటాను. పప్పు, రసం, కూర, పెరుగు.. ఏం వడ్డించుకున్నా అదనంగా ఉప్పు కలుపుకోవాల్సిందే. అవసరానికి మించిన ఉప్పుతో గుండె జబ్బు, రక్తపోటు చుట్టుముట్టే ప్రమాదం ఉందని నాకు తెలుసు. రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుందని నిపుణులు చెప్పారు. ఇక చక్కెర అయితే తీయని శత్రువే. మెదడును సైతం దెబ్బతీయగల శక్తి దానికి ఉంది. ఈ ఏడాది నుంచి సాధ్యమైనంత వరకూ ఉప్పు తగ్గించుకుంటాను. తీపి పట్ల మోజు వదిలించుకుంటాను.
మనం శరీరం గురించే ఆలోచిస్తాం. మనసును పట్టించుకోం. మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని నాకు ఈ మధ్యే అర్థమైంది. మన మనసు ఆలోచనల చుట్టూ తిరుగుతుంది. బుర్రలోంచి పుట్టుకొచ్చే ప్రతి ఆలోచననూ పట్టుకుని వేలాడటం వల్లే.. మనోరుగ్మతలు దాడి చేస్తాయి. ఆలోచనల మీద మనం పట్టు సాధించాలి. ఏం ఆలోచించాలన్నది మనమే నిర్ణయించుకోవాలి. ధ్యానాన్ని జీవితంలో భాగం చేసుకోవడం ద్వారానే అది సాధ్యం. సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని అధిగమించే మార్గం వెతకాలి. చీకటి గదిలో చిక్కుకున్నప్పుడు, ‘అయ్యో అంధకారం!’ అని ఏడ్చినంత మాత్రాన వెలుతురు వస్తుందా? దీపం వెలిగించే ప్రయత్నం చెయ్యాలి. కొవ్వొత్తి వెతకాలి. ఈ ఏడాది నేను ఆ
వెలుతురు మార్గాన్నే ఎంచుకుంటాను.
ఆరోగ్యకర జీవనశైలితో వ్యాధులను ఆమడదూరం ఉంచవచ్చు. కానీ కొన్నిసార్లు ఏదో ఓ రూపంలో రుగ్మతలు చుట్టుముట్టే ప్రయత్నం చేస్తాయి. ఆ చొరబాటును గట్టిగా నిరోధించడానికి ముందస్తు చర్యలు అవసరం. నలభై ఏండ్లు దాటిన తర్వాత ఏడాదికి ఒకసారైనా సమగ్ర వైద్య పరీక్షలు చేయించుకోవాలి. కొత్త ఏడాది నుంచి ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. అనేక రుగ్మతలకు వ్యాక్సిన్లు ఉన్నాయి. పరిపూర్ణ ఆరోగ్యానికి ఈ రెండూ అవసరమే అని గుర్తించాను.
నా కోసం నేను అనుకోవడంలో స్వార్థం ఉంది. నలుగురికోసం అనుకోవడంలో సంతృప్తి ఉంది. ఓ మంచి పని చేయడంలో, ఓ నిరుపేదకు సాయపడటంలో, సామాజిక సేవలో పాలుపంచుకోవడంలో, ఓ సత్కార్యానికి విరాళం ఇవ్వడంలో.. ఎనలేని సంతృప్తి లభిస్తుంది. మెదడులో ఆనంద హార్మోన్ల ఊట పెరుగుతుంది. ఆ ప్రభావం గుండె పనితీరును మెరుగుపరుస్తుంది, రక్తపోటును క్రమబద్ధం చేస్తుంది. కాబట్టి నా సమయంలో కొంత, నా సంపాదనలో కాస్తంత సేవా కార్యక్రమాలకు కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
కొవిడ్ ఏదో ఓ రూపంలో మనల్ని వెంటాడుతూనే ఉన్నది. తీవ్రత తక్కువని చెబుతున్నా.. ఆ జిత్తులమారి వైరస్ను ఓ పట్టాన నమ్మలేం. కాబట్టి, మూడేండ్ల క్రితం ఎంత అప్రమత్తంగా ఉన్నామో.. ఇప్పుడూ అంతే జాగ్రత్తగా ఉంటాను. మాస్క్ ధరిస్తాను. శానిటైజర్ ఉపయోగిస్తాను. గుంపులను దూరం పెడతాను. దీర్ఘకాలికమైన జలుబు, దగ్గు, జ్వరం తదితర సమస్యల్ని తేలిగ్గా తీసుకోను. వెంటనే వైద్యులను సంప్రదిస్తాను. బయటి తిండి తినను. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తాను.
ప్రతిజ్ఞ అంటే.. మనకు మనం చేసుకునే వాగ్దానం. మాట తప్పితే ఆత్మవంచన చేసుకున్నట్టే. ఆ అపరాధభావం వెంటాడుతూనే ఉంటుంది. ప్రతి నెలా నా ప్రతిజ్ఞల్ని ఎంతవరకు పాటించగలుగుతున్నాను, ఏ మేరకు లాభం పొందుతున్నాను? అనేది ఓచోట రాసుకుని.. లోపాలను బేరీజు వేసుకుంటాను. నన్ను నేను నిజాయతీగా సమీక్షించుకుంటాను. కొత్త సంవత్సరంలో సరికొత్త మనిషిగా అవతరిస్తాను.