జీవన్మరణ సమస్యగా పరిణమించిన క్యాన్సర్లకు తగిన చికిత్స పొందడం రోగులకు పెద్ద పరీక్షే. కీమోథెరపీ, రేడియేషన్, ఇమ్యునోథెరపీ, బయలాజికల్ ఏజెంట్స్ లాంటివి రక్త క్యాన్సర్ల చికిత్స తొలిదశల్లో ప్రామాణికమైనవి. అయితే, కొంతమందిలో మాత్రం ఇవి శాశ్వతమైన ఉపశమనం కలిగించలేకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఎముక మూలుగ (అస్థిమజ్జ) మార్పిడి (బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్-బీఎంటీ) తగిన ఎంపికగా నిలుస్తుంది. విషమించిన రక్త క్యాన్సర్ల విషయంలో ఎముక మూలుగ మార్పిడి విజయవంతమైన చికిత్సగా అవతరించింది.
బీఎంటీ చికిత్సలో భాగంగా రోగి రక్తంలోకి ఆరోగ్యకరమైన మూలకణాలను ఎక్కిస్తారు. దీంతో రోగి శరీరం అత్యవసరమైన రక్త కణాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది. అలా రోగ నిరోధక శక్తి పునరుత్తేజితం అవుతుంది. తీవ్రమైన రక్త రుగ్మతలైన అప్లాస్టిక్ ఎనీమియా, తలసేమియా, సికిల్సెల్ ఎనీమియా, మల్టిపుల్ మైలోమా, అక్యూట్ మైలాయిడ్ లుకేమియా లాంటి రక్త క్యాన్సర్లు, లింఫోమా సమస్యల్లోనూ ఈ చికిత్సను ఉపయోగిస్తారు. ఇందులో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి.
1. ఆటోలోగస్
ఈ రకం చికిత్సలో రోగి సొంత
హీమోపోయిటిక్ మూల కణాలను
ఉపయోగిస్తారు.
2. అలోజెనీక్
ఈ రకంలో ఆరోగ్యకరమైన దాత
హీమోపోయిటిక్ మూల కణాలను
ఉపయోగించి చికిత్స అందిస్తారు.
రక్త క్యాన్సర్ల చికిత్సలో ఇతర చికిత్సలు పనిచేయనప్పుడు, రోగుల దీర్ఘకాల జీవితానికి హామీ ఇవ్వాలంటే ఎముక మూలుగ మార్పిడి ప్రభావవంతమైన చికిత్స. ఇది చాలా సంక్లిష్టమైన చికిత్సా విధానం. దీనివల్ల.. అలసట, వికారం (నాజియా), నోట్లో పుండ్లు (అల్సర్లు), రక్తం ఎక్కించాల్సి రావడం, ఇన్ఫెక్షన్లు ప్రబలే ప్రమాదం లాంటి సమస్యలు పొంచి ఉంటాయి. కాబట్టి ఎముక మూలుగ మార్పిడి చికిత్స జరుగుతున్నన్ని రోజులూ రోగిని నిపుణులైన వైద్యులు, నర్సులు, పోషకాహార నిపుణులు, ఇతర సంబంధిత నిపుణులు అంటిపెట్టుకుని ఉండాల్సి వస్తుంది. రోగికి ఇన్ఫెక్షన్ల ముప్పు తగ్గించి, వ్యాధి నుంచి కోలుకోవడం కోసం వారిని క్రిమి రహితం చేసిన స్టెరైల్ గదిలో ఉంచాలి. రోగి కోలుకోవడం మీదే దృష్టిపెట్టి చికిత్స అందించాలి.
రక్త క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ, కీమో ఇమ్యునోథెరపీ, బయలాజికల్ ఏజెంట్స్, ఇతర చికిత్సలను కలగలిపి తొలిదశలో (ప్రాథమికంగా) చికిత్స అందిస్తారు. ఎంత ఉత్తమ చికిత్స అందించినా, కొన్ని రక్త క్యాన్సర్లు తొలి దశ చికిత్స తర్వాత మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఎముక మూలుగ మార్పిడి (బీఎంటీ) రోగులకు మళ్లీ జీవితాన్ని ప్రసాదిస్తుంది. వైద్య రంగంలో సాధించిన అభివృద్ధి కారణంగా కొత్త ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. అలా బీఎంటీ మరింత సురక్షితమైన చికిత్సగా అవతరించింది. రక్త క్యాన్సర్ రోగులకు ఓ ఆశాదీపంలా మారిపోయింది.