లండన్ : పండ్లు, కూరగాయలు తరచూ తీసుకుంటే ఆరోగ్యానికి మేలని పలు అధ్యయనాలు, పరిశోధనలు వెల్లడించాయి. అయితే వాటిని రోజుకు ఎంత మొత్తంలో తీసుకోవాలనే విషయంలో పలు సందేహాలు వెంటాడతాయి. హార్వర్డ్ పరిశోధకుల విశ్లేషణ ప్రకారం రోజుకు ఐదు సర్వింగ్స్ చొప్పున పండ్లు, కూరగాయలను తీసుకుంటే మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని హార్వర్డ్ హెల్త్ లెటర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ హైదీ గాడ్మన్ చెబుతున్నారు.
ఇంతస్ధాయిలో పండ్లు, కూరగాయలు తీసుకునే స్ధోమత, సమయం, లభ్యత లేకున్నా ఈ సాత్విక ఆహారంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని చెప్పుకొచ్చారు. 20 లక్షల మంది ఆహారపు అలవాట్లను పరిశీలించడం, పలు అధ్యయన నివేదికలను విశ్లేషించిన మీదట పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. రోజుకు రెండు సర్వింగ్ల పండ్లు, కూరగాయలు తీసుకుంటామని తెలిపిన వారితో పోలిస్తే రోజుకు ఐదు సర్వింగ్ల ఈ తరహా ఆహారం తీసుకున్న వారిలో ఏ కారణం చేతనైనా మరణాల ముప్పు 13 శాతం తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది.
ఇక వీరిలో క్యాన్సర్ ద్వారా మరణాల ముప్పు 10 శాతం, శ్వాసకోశ వ్యాధులతో మరణించే ముప్పు 35 శాతం తక్కువగా ఉంది. మంచి ఆరోగ్యానికి ముఖ్యంగా గుండె, రక్తనాణాల ఆరోగ్యానికి అవసరమైన పలు పోషకాలు పండ్లు, కూరగాయల్లో ఉంటాయని, వీటితో పాటు పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, పాలీపెనాల్స్ వీటిలో ఉంటాయని అధ్యయన రచయిత, హార్వర్డ్ మెడికల్ స్కూల్కు చెందిన డాక్టర్ డేనియల్ వాంగ్ చెప్పారు.