కొవిడ్ తర్వాత పెరటి మొక్కల పెంపకం పెరిగింది. ఇంటి అలంకరణలోనూ మొక్కలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వర్టికల్, రూఫ్ గార్డెనింగ్ కూడా విస్తరిస్తున్నది. పచ్చని మొక్కలు ఆహ్లాదాన్నీ, ఆరోగ్యాన్నీ
ప్రసాదిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
తరచూ పచ్చని మొక్కల్ని చూడటం వల్ల ఒత్తిడి తగ్గిపోతుందని నార్త్ క్యాలిఫోర్నియా యూనివర్సిటీ అధ్యయనం చెబుతున్నది. ఆహ్లాదకర వాతావరణంలో కార్టిజోల్ హార్మోన్ విడుదల అవుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గిపోయి సంతోషంగా ఉంటారు. క్యాలిఫోర్నియా పరిశోధకులు.. ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న రోగులలో కొందరిని మొక్కల మధ్య, మరికొందరిని మొక్కల బొమ్మలున్న పోస్టర్ల మధ్య, కొంతమందిని ఈ రెండూ లేని చోట ఉంచారు. మొక్కల మధ్య ఉన్నవాళ్లు, మొక్కలున్న పోస్టర్ల మధ్య ఉన్నవాళ్లలో ఒత్తిడి చాలా తక్కువగా ఉన్నట్టు నిపుణుల బృందం గుర్తించింది.
పెరటి పచ్చదనం ఏకాగ్రతను పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రభావం పిల్లల చదువుల మీదా ఉంటుంది. పచ్చని మొక్కలున్న తరగతి గదిలో చదివే విద్యార్థులను, సాధారణ గదుల్లో చదివే పిల్లలను సరిపోల్చి పరిశీలించినప్పుడు.. మొక్కల మధ్య చదివే పిల్లలు ఇతరుల కంటే మెరుగ్గా ఉన్నారని గుర్తించారు.
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కాలిన గాయాలతో బాధపడుతున్నవారు ఆ రుగ్మతల నుంచి కోలుకోవడంలోనూ మొక్కలు సహకరిస్తాయని నిర్ధారణ అయ్యింది. మిగిలినవారితో పోలిస్తే.. పెరటి మొక్కల మధ్య సేదతీరుతున్నవారు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందారని అమెరికన్ హార్టికల్చరల్ థెరపీ అసోసియేషన్ ఓ అధ్యయనంలో నిరూపించింది.
మొక్కలు పూలతోపాటు, ఆనందాన్నీ పూస్తాయట. అంతేనా, అందరి మోమున నవ్వులు పూయిస్తాయి కూడా. రూట్గేర్ యూనివర్సిటీలో నిర్వహించిన అధ్యయనంలో ఆకుపచ్చ, పర్పుల్ రంగు పూల మొక్కల మధ్య ఇళ్లు కట్టుకున్నవారు చాలా సంతోషంగా ఉన్నట్టు గుర్తించారు.
మనోవ్యధ లక్షణాలను పోగొట్టే శక్తి మొక్కలకు ఉందంటారు. బల్గేరియా ప్రజలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది. ఇంటిని ఆహ్లాదంగా మార్చే మొక్కల వల్ల అర్థంలేని భయాలు, తలాతోకా లేని ఊహలు దూరం అవుతున్నట్టు అక్కడి నిపుణులు తేల్చారు.