న్యూఢిల్లీ : అధిక రక్తపోటు (High blood pressure) దేశ యువతను వెంటాడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. నిశ్శబ్ధంగా హైపర్టెన్షన్ భారత యువజనాభాను తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. మారుతున్న జీవన శైలి, నిద్రలేమి, ఒత్తిడి వంటివి యువతను హైబీపీ బారినపడవేస్తున్నాయి. సాధారణంగా బీపీ 90/60ఎంఎంహెచ్జీ నుంచి 120/80ఎంఎంహెచ్జీ వరకూ ఉండాలి. 140/90ఎంఎంహెచ్జీ అంతకుమించి బీపీ రీడింగ్ చూపితే దాన్ని హైబీపీగా పరిగణిస్తారు.
బీపీని సకాలంలో గుర్తించి నియంత్రణలో ఉంచుకోకుంటే అది స్ట్రోక్, గుండెపోటు, గుండె వైఫల్యం, కిడ్నీ వైఫల్యం సహా ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరిస్తోంది. ఇక భారత్లో యువతను హైబీపీ వేధిస్తున్నది. భారత్లో చోటుచేసుకుంటున్న మరణాల్లో 10.8 శాతం మరణాలకు హైపర్టెన్షన్ కారణమని ఐసీఎంఆర్ చెబుతోంది. గతంలో వృద్ధులు, మధ్యవయస్కుల్లో ఎక్కువగా అధిక రక్తపోటు ఉండేదని ఇప్పుడు యువతనూ ఈ సమస్య వేధిస్తోందని ఆసియన్ ఆస్పత్రి కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎల్కే ఝా ఆందోళన వ్యక్తం చేశారు.
30ల్లో ఉన్న యువతనూ అధిక రక్తపోటు కబళిస్తోందని అన్నారు. పని ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, నిద్రలేమి దేశ యువత ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. మన దేశంలో 30 ఏండ్లు దాటిన తర్వాతే ఆరోగ్య పరీక్షల గురించి ఆలోచిస్తున్నారని అప్పటికే నిద్రాణంగా జీవనశైలి వ్యాధులు తలెత్తుతున్నాయని వివరించారు. ముందే స్క్రీనింగ్ నిర్వహించడం, ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన పెంచడం ద్వారా రానున్న ఆరోగ్య సంక్షోభాన్ని నివారించగలుగుతామని డాక్టర్ ఝా చెప్పుకొచ్చారు.
Read More :
Health Tips | ఫాస్ట్ఫుడ్కు ఎక్కువగా అలవాటు పడ్డారా.. అజినమోటో ఎంత ప్రమాదకరమో తెలుసుకోవాల్సిందే!