అనారోగ్యకరమైన చిరుతిండ్లతో పక్షవాతం, గుండెజబ్బుల ముప్పు పెరుగుతున్నదని ఓ తాజా అధ్యయనం తేల్చిచెప్పింది. ఇందులో భాగంగా నిపుణులు.. 854 మంది యువతీయువకుల చిరుతిండ్ల అలవాట్లను అధ్యయనం చేశారు. అధ్యయనంలో పాల్గొన్నవారిలో 26 శాతం మంది ఆరోగ్యకరమైన ప్రధాన ఆహారాన్ని ఎంచుకున్నా.. అధికంగా ప్రాసెస్ చేసిన, చక్కెరలు ఎక్కువగా ఉన్న చిరుతిండ్లకు అలవాటు పడిపోయారు. అనారోగ్యకరమైన చిరు తిండ్లకు… అధిక బరువును సూచించే బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) పెరగడానికి, శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడానికి, రక్తంలో అధిక చక్కెర స్థాయుల మూలంగా వచ్చే హైయర్ పోస్ట్ప్రాండియల్ రుగ్మతలైన పక్షవాతం, గుండె కవాటాల వ్యాధులు, ఊబకాయం తదితర సమస్యలతో సంబంధం ఉంటుంది. దీనికి భిన్నంగా గింజలు, తాజాపండ్లు లాంటి ఆరోగ్యకరమైన చిరుతిండ్లు మన జీవక్రియలను మెరుగ్గా ఉంచుతాయి. ఆకలిని తగ్గిస్తాయి.
ఈ అధ్యయనం యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైంది. “మన శరీరంలో పావుభాగం కెలోరీలు 95 శాతం వరకు చిరుతిండ్ల నుంచే అందుతాయి. కాబట్టి, పరిపూర్ణ జీవితం కోసం బిస్కెట్లు, చిప్స్, కేకుల లాంటి అనారోగ్యకరమైన చిరుతిండ్ల నుంచి పండ్లు, గింజల వైపు మళ్లడం మంచిది” అంటున్నారు లండన్లోని కింగ్స్ కాలేజీకి చెందిన డాక్టర్ సారా బెరీ. అంతేకాదు… రాత్రి 9 గంటల తర్వాత చిరుతిండ్లు తీసుకోవడం కూడా మంచిది కాదట. మొత్తానికి మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందనేది ఈ అధ్యయన సారాంశం. పండ్లు, కూరగాయలు, ప్రొటీన్లు, పప్పు ధాన్యాలు మొదలైన వాటితో కూడిన సమతులాహారంతో మీ పళ్లాన్ని సిద్ధం చేసుకోండి మరి!