World Health Day | హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు 60-70 ఏండ్లు వయసులోనూ ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు 35-40 ఏండ్లకే బీపీ, షుగర్.. 10-15 ఏండ్లకే సోడాబుడ్డి కండ్లద్దాలు.. నెలకొకసారి జ్వరం.. మూడు నెలలకు ఒకసారి దవాఖాన చెకప్లు.. 20 ఏండ్లకే గుండెపోటు మరణాలు.. ఇందుకు ప్రధాన కారణం జీవనశైలే. మన నడతను మార్చుకుంటేనే మన బతుకు నడక మారుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నదని చెప్తున్నారు. ఆరోగ్యానికి శారీరక శ్రమ, పోషకాహారం, మానసిక ప్రశాంతత అత్యంత అవసరమని చెప్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 80% మంది శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. ప్రతి నలుగురిలో ఒకరు కనీస శరీర ప్రమాణాలను అందుకోలేకపోతున్నారు. ఫలితంగా వారిలో ముందస్తుగా మరణించే అవకాశాలు 20-30% పెరుగుతాయని హెచ్చరిస్తున్నది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. రోజూ వ్యాయామం చేస్తే బీపీ, షుగర్ వంటివి రాకుండా నియంత్రించవచ్చని, గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోవచ్చని, క్యాన్సర్ను కూడా నియంత్రించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నది. 18-64 ఏండ్ల మధ్య వయస్కులు రోజుకు కనీసం రెండున్నర గంటల నుంచి ఐదు గంటలపాటు శారీరక శ్రమ చేయాలని సూచిస్తున్నది. 65 ఏండ్లకు పైబడినవారు రోజూ వాకింగ్ చేయాలని, వారంలో కనీసం మూడు రోజులపాటు శారీరక శ్రమ చేయాలని డబ్ల్యూహెచ్వో సూచిస్తున్నది.
ప్రంపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 3-4 ఏండ్ల మధ్య పిల్లలు రోజూ కనీసం మూడు గంటలపాటు ఆడుకోవాలి. కనీసం 10 గంటల పాటు నిద్ర పోవాలి. మొబైల్ లేదా టీవీ స్క్రీన్ను ఎట్టి పరిస్థితుల్లో గంటకు మించి చూడరాదు. 5-17 ఏండ్ల మధ్య వయస్కులు రోజుకు కనీసం గంటపాటు శారీరక శ్రమ చేయాలి. నడవడం, ఎక్సర్సైజ్లు, ఆటలు తప్పనిసరి దినచర్యగా ఉండాలి. పిల్లలు ఎండలో ఆడుకోవడం, రోజంతా ఏదో ఒక రూపంలో శారీరక శ్రమ చేయడం వల్ల వారి ఎముకలు, కండరాలు గట్టిపడతాయని, రోగ నిరోధకశక్తి పెరుగుతుందని, కంటిచూపు కూడా బాగుంటుందని డబ్ల్యూహెచ్వో స్పష్టం చేస్తున్నది.
మనం తినే ఆహారంలో చెక్కర, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించి.. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. కావాల్సిన ప్రొటీన్ల కోసం ప్రత్యేక ప్యాకెట్లు కొనే అవసరం లేదని.. ఏయే పండ్లు, కూరగాయల్లో ఏమే ప్రొటీన్లు, మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకొని తింటే సరిపోతుందని చెప్తున్నారు.
మొబైల్ అడిక్షన్ తగ్గాలి
‘సికింద్రాబాద్లోని ఓ షాపింగ్మాల్.. ఒక జంట ఇద్దరు పిల్లలతో కలిసి దుస్తులు కొనేందుకు వచ్చారు. పిల్లలిద్దరూ పదేండ్లలోపువాళ్లే. తల్లిదండ్రులు వారిని ఒక దగ్గర కూర్చోబెట్టి చెరో ఫోన్ చేతికిచ్చారు. అంతే.. వాళ్లు లోకాన్ని మరిచిపోయి ఫోన్లో మునిగిపోయారు. ఆ తల్లిదండ్రులు సుమారు 40 నిమిషాలపాటు రెండు అంతస్తుల్లో తిరిగి తమకు కావాల్సిన దుస్తులను తీసుకొని వ చ్చే వరకు ఆ పిల్లలు కూర్చోబెట్టిన చోటే ఉన్నారు’.. ప్రస్తుతం మొబైల్/స్క్రీన్ అడిక్షన్కు ఇది పెద్ద ఉదాహరణ. ఏడాది వయసున్న పిల్లలు మొదలు ప్రతిఒక్కరూ ఫోన్లలో గంటలసేపు మునిగిపోతున్నారు. వీడియోలు చూపిస్తేనే తింటున్నారు. ఇది పిల్లల ఆరోగ్యాలను తీవ్రం గా దెబ్బతీస్తున్నది. ఈ సమయాన్ని తగ్గించి ఆటలవైపు మళ్లించకపోతే వచ్చే తరాన్ని మన చేతులారా నాశనం చేసినవాళ్లం అవుతామని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి
ఉరుకుల పరుగుల జీవనంలో మానసిక ఒత్తిడులు పెరిగిపోయాయి. మానసిక ఒత్తిడి వల్ల బీపీ, షుగ ర్ వచ్చే అవకాశాలు ఉన్నా యి. ఇవి శరీరంలోని ఒ క్కో అవయవాన్ని క్రమం గా దెబ్బతీస్తాయి. మానసిక ఒత్తిడి కుటుంబ సం బంధాలు, సామాజిక సంబంధాలపైనా ప్రభావం చూపుతుంది. కాబట్టి వ్యాయామంతోపాటు మెడిటేషన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
గుండెపోట్లను కొనితెచ్చుకుంటున్నాం
యువత మరణాలకు యాక్సిడెంట్లు, ఇన్ఫెక్షన్లు, గుండెపోట్లు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. చిన్న వయసులోనే గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. గుండెపోటుకు ప్రధాన కారణాలు పొగ తాగడం, డ్రగ్ తీసుకోవడం, కుటుంబ చరిత్ర. కాబట్టి యువత కచ్చితంగా ధూమపానం, డ్రగ్స్కు పూర్తిగా దూరంగా ఉండాలి. కొందరిలో పై మూడు కారణాలు కాకపోయినా గుండెపోటుకు గురవుతున్నారు. ఇందుకు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం కారణం.
– డాక్టర్ శరత్రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్