మూడువేల అడుగులు..
రోజూ కనీసం మూడువేల అడుగులు వేస్తే వృద్ధుల్లో అధిక రక్తపోటు సమస్య గణనీయంగా తగ్గిపోతుందని తాజా అధ్యయనం ఒకటి తెలిపింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ దీన్ని నిర్వహించింది. వృద్ధులు భారీ కసరత్తులు చేయలేరు కాబట్టి,మితమైన నడక ద్వారా వారికి ఆరోగ్య ప్రయోజనాలు ఏమైనా ఉంటాయేమో కనుక్కోవాలని పరిశోధకులు నిర్ణయించుకున్నారు. రోజూ కనీసం 3,000 అడుగులు క్రమం తప్పకుండా వేసిన వారిలో రక్తపోటు సూచికలైన సిస్టోలిక్ ప్రెషర్ ఏడు పాయింట్లు, డయాస్టోలిక్ ప్రెషర్ నాలుగు పాయింట్లు తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. కాబట్టి, నడక లాంటి సులభమైన జీవనశైలి మార్పులతో ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. అడుగుల లెక్కల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరమూ లేదు. అనేక మొబైల్ అప్లికేషన్స్ దొరుకుతున్నాయి. సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది.
ఒక్క టీకా… సూపర్బగ్స్ ఠా!
బ్యాక్టీరియా, ఫంగస్ ద్వారా అనేక వ్యాధులు సంక్రమిస్తాయని తెలిసిందే. వాటిని అరికట్టడానికి ప్రస్తుతం వేర్వేరు టీకాలు వేయాల్సి వస్తున్నది. ఇలా కాకుండా, ఒకే ఒక్క టీకాతో వ్యాధికారక క్రిముల నిర్మూలన సాధ్యమవుతుంది అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా పరిశోధకులు. ఈ క్రమంలో ఒక కొత్త టీకాను అభివృద్ధి చేశారు. దానిని ఎలుకల మీద ప్రయోగించి చూశారు. ఎలుకలకు సోకే ఎనిమిది వేర్వేరు బ్యాక్టీరియా, ఫంగస్ సూక్ష్మక్రిములకు వ్యతిరేకంగా రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆ టీకా సఫలమైందని ఈ పరిశోధన వెల్లడించింది.
వృద్ధుల్లో ఏడీహెచ్డీతో ప్రమాదాలు
వృద్ధాప్యంలో చాలామందిపై అటెన్షన్ డెఫిసిట్/ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్డీ) దాడిచేస్తుంది. ఇది జాగరూకత లేకపోవడం, ఆలోచన లేమికి సంబంధించిన సమస్య. ఏడీహెచ్డీ కారణంగా.. వృద్ధులు వాహనం నడుపుతున్నప్పుడు రోడ్డు ప్రమాదాలకు దారితీసే ఆస్కారం ఉంటుందట. ఈ అంశాన్ని అమెరికాకు చెందిన కొలంబియా యూనివర్సిటీ మెయిల్మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు నిర్ధారించారు. ఏడీహెచ్డీ, డ్రైవింగ్ మధ్య సంబంధం గురించిన పరిశోధనలు ఇప్పటివరకు పిల్లలు, యువతకే పరిమిత మయ్యాయి. తాజా పరిశోధన వృద్ధులకు ఓ హెచ్చరికను జారీచేస్తున్నది.