వాసనను గుర్తించే శక్తి క్షీణించడానికి, తర్వాత కాలంలో కుంగుబాటు లక్షణాలు వృద్ధి చెందడానికి మధ్య సంబంధం ఉన్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. ప్రాథమిక దశలో హైపోసోమ్నియాగా, సమస్య మరీ తీవ్రమైతే ఎనోసోమ్నియాగా పిలిచే ఈ పరిస్థితి వృద్ధుల్లో అల్జీమర్స్తో ముడిపడి ఉంటుంది. ‘వాసనను గుర్తించే శక్తి తగ్గిపోవడం అల్జీమర్స్, పార్కిన్సన్స్ తదితర నాడుల క్షీణతకు సంబంధించిన వ్యాధులకు తొలి సంకేతం. వాసన పసిగట్టలేకపోవడం అనేది కుంగుబాటు లక్షణాలతో సంబంధం కలిగి ఉంటుందనే విషయం ఈ అధ్యయనంలో తేలింది’ అంటారు పరిశోధకులు. ఈ అధ్యయనం అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిపుణులు నిర్వహించారు.
గర్భధారణ సమయంలో బరువును అదుపులో ఉంచుకోవడానికి డైటీషియన్ల సలహాలు అవసరమవుతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. 30 ఏండ్ల నుంచి అందుబాటులో ఉన్న 100 అధ్యయనాలను పరిశీలించి ఈ విషయాన్ని నిర్ధారించారు. గర్భిణులు తరచూ డైటీషియన్లను సంప్రదిస్తే మంచిదట. అంతులేని వికారం, విపరీతమైన ఆకలి, తరచూ అలసట లాంటి ఇబ్బందులను అధిగమించడానికి ఈ సంప్రదింపులు దోహదపడతాయి. ఈ పరిశోధనలో పాలుపంచుకున్న ఆరోగ్య నిపుణురాలి పేరు షకీలా తంగరత్నం. ఇక, గర్భిణులు బరువును అదుపులో ఉంచుకోవడానికి వ్యాయామం అవసరమనే విషయంపై తగినన్ని ఆధారాలు లభించలేదని షకీలా తెలిపారు.
చిన్నపిల్లలు కారంకారంగా, ఉప్పు ఉప్పుగా ఉండే ఆహారాన్ని ఇష్ట పడతారు. తియ్యటి పండ్లంటే మొహం తిప్పుకొంటారు. అయితే, డైనింగ్ టేబుల్ దగ్గర ఓ పది నిమిషాలు ఎక్కువగా ఉంచగలిగితే కనుక.. ఆ చిన్నారులు మరిన్ని పండ్లు తింటారట. సగటున 100 గ్రాములు ఎక్కువే తింటారట. ఈ కిటుకును కనుక ప్రయోగిస్తే.. రోజువారీగా తీసుకోవాల్సిన పరిమాణంలో కనీసం ఐదోవంతు పండ్లు పిల్లల పొట్టలో చేరుకుంటాయి. ఈ అధ్యయనం జామా నెట్వర్క్ ఓపెన్లో ప్రచురితమైంది. దీనివల్ల పిల్లల గుండె పనితీరుకు సంబంధించిన ఇబ్బందులు 6 నుంచి 7 శాతం తగ్గుతాయని కూడా వెల్లడించింది.