వయసు మీదపడే కొద్దీ ఆలోచనా శక్తి తగ్గుతూ వస్తుంది. ఈ పరిస్థితి రావొద్దంటే గోల్ఫ్ ఆడాలని, లేదంటే నడక లాంటి మితమైన వ్యాయామాలైనా చేయాలని ఒక కొత్త అధ్యయనంలో తేలింది. రోజుకు నాలుగు కిలోమీటర్లు నడిచినా, లేదంటే 18 హోల్స్ గోల్ఫ్ ఆడినా జ్ఞాపకశక్తి మెరుగవుతుందట. చేతుల్లో ఒక రకం కర్రలు పట్టుకుని నడిచే నార్డిక్ వాకింగ్ వల్ల కూడా ఇదే ప్రయోజనం ఉంటుందట. కాబట్టి, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే .. వృద్ధాప్యంలో వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలను అధిగమించవచ్చు.
చెప్పిన మాట విననప్పుడు, తప్పులు చేసినప్పుడు పిల్లల మీద పెద్దగా అరుస్తారు, విరుచుకుపడతారు. ఇది వారిని లైంగికంగా వేధించడంతో సమానమట. పైగా ఆ చేదు అనుభవం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందట. ‘చైల్డ్ అబ్యూజ్ అండ్ నెగ్లెక్ట్’ అనే జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. పిల్లల మీద అరిచేవారిలో.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇంట్లో ఇతర పెద్దలు, ఉపాధ్యాయులు ముందు వరసలో ఉంటారట. కేకలువేయడం, తక్కువ చేసి చూడటం, పరిహసించడం, తిట్టడం లాంటివి మౌఖికమైన హింస కిందికి వస్తాయి. అయితే, క్రమశిక్షణ పేరుతో ఇలాంటి కర్రపెత్తనాలు సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంటాయి. మనసుపై పడిన గాయాల గురుతులు.. పిల్లలకు దీర్ఘకాలంలో చెడు చేస్తాయని ఈ అధ్యయనం హెచ్చరించింది.
అజీర్తికి కారణమైన పొట్ట ఆమ్లాలను తగ్గించడంలో పసుపు ఔషధాలతో సమానంగా పనిచేస్తుందని థాయ్లాండ్ అధ్యయనంలో తేలింది. పసుపులోని కర్క్యుమిన్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబియల్ గుణాలు ఉంటాయి. పైగా పసుపు కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని చాలామంది నమ్మిక. ఇక ఆగ్నేయ ఆసియా దేశాల్లో పూర్వం నుంచే పసుపును యాంటాసిడ్గా వాడుతున్నారు. సాధారణంగా అజీర్ణం వల్ల కడుపునొప్పి, వాపు, కడుపు ఉబ్బరం, వికారం, ఆమ్లం పైకి ఉబకడం, గుండెమంట, తేన్పులు లాంటి సమస్యలు తలెత్తుతాయి. 18 నుంచి 70 ఏళ్ల వయసు అజీర్ణ సమస్య ఉన్నవారిపై ఈ అధ్యయనం జరిపారు. వీరిని మూడు వర్గాలుగా చేశారు. ఒక వర్గం వారికి కర్క్యుమిన్ ట్యాబ్లెట్లు, మరొక వర్గానికి ఒమెప్రజోల్ అనే యాంటాసిడ్, ఇంకో వర్గానికి రెండూ కలిపి ఇచ్చారు. 28 రోజుల తర్వాత పరిశీలిస్తే అందరిలో ఒకేరకమైన పరిస్థితులు కనిపించాయట. అలా పరిశోధకులు పసుపు కూడా అజీర్ణానికి మంచి మందులా పని చేస్తుందన్న నిర్ణయానికి వచ్చారు. అయితే, సొంత వైద్యానికి పోకుండా డాక్టర్ల సలహా మేరకే వాడాలని హెచ్చరించారు.