ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురికావడం కల్పనకు ఆవేదన కలిగించింది. ఆ సమస్యకు పరిష్కారం వెతకాలనుకున్నారు. రోగ నిరోధక శక్తి లేకపోవడం వల్లే సీజనల్ వ్యాధులు, వైరస్లు చుట్టుముడుతున్నట్టు గ్రహించారు. మరుక్షణం, ఇమ్యూనిటీ మీద ఫోకస్ చేశారు. సహజ పోషకాలతో ‘ఆమ్లా జ్యూస్’ తయారీకి శ్రీకారం చుట్టారు. అంతేకాదు, ప్రాచీన ఆయుర్వేద పద్ధతులకు ఆధునిక సాంకేతికతను జోడించి పదహారు రకాల హెర్బల్స్తో ఓ ఉత్పత్తిని ఆవిష్కరించారు. ‘సుకల్ప ఆర్గానిక్ బ్రాండ్’ పేరుతో వాటిని అందుబాటులోకి తెచ్చారు గుజ్జు కల్పన.
కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లాలికి ఆనందం. కానీ భర్త, పిల్లలు, అత్తమామలు, దగ్గరి బంధువులు.. ఎవరో ఒకరికి ఏదో ఓ సమస్య. ముప్పూటలా పిడికెడు మాత్రలు మింగాల్సిందే. ఆ ఇంగ్లిష్ మందుల దుష్పరిణామాలు ఆమెకు భయం కలిగించేవి. అందులోనూ ఫార్మసీ చదువుకున్నారు. ఔషధాల తయారీ వెనుక ఉన్న రహస్యాలన్నీ తనకు ఎరుకే.
ఆ ప్రభావాలు, దుష్ప్ర భావాలు కాచి వడపోశారు కూడా. సగానికి సగం ఆరోగ్య సమస్యలకు మూలం రోగ నిరోధక శక్తి కొరతే అని ఆమెకెవరూ చెప్పాల్సిన పన్లేదు. కాబట్టే, సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించే పదార్థాలలోనే ఓ పరిష్కారం వెతకాలని భావించారు. ఆ ఆలోచనే ఉసిరి రసం తయారీకి ఉసిగొల్పింది. ఇది మన సంప్రదాయ దినుసు. ఉసిరితో పచ్చడి పెట్టుకుంటాం. మిఠాయిలు చేసుకుంటాం. పచ్చిగానూ ఆరగిస్తాం. ‘విటమిన్-సి పుష్కలంగా లభించే ఈ ద్రావకాన్ని కనుక తీసుకుంటే అనారోగ్యానికి ఆమడదూరంలో ఉండవచ్చు’ అని చెబుతారు గుజ్జు కల్పన. అయినవారికోసం ఆరంభించిన ప్రయత్నం అందరికోసం కొనసాగుతున్నది. వీహబ్ సాయంతో స్టార్టప్గా అవతరించింది.
విటమిన్ల శక్తి కేంద్రం
మనం జ్యూస్ పేరుతో తీసుకునే నిల్వ ద్రావకాల్లో పండ్ల రసాల వాటా తక్కువ. ఇబ్బడిముబ్బడిగా రసాయనాలు జోడిస్తారు. ఎక్కువ కాలం నిల్వ ఉండేలా కృత్రిమ పదార్థాలు గుప్పిస్తారు. ఈ తరహా ఉత్పత్తుల వల్ల ఉన్న రోగాలు నయంకావడం అటుంచి.. కొత్త రోగాలు పుట్టుకొస్తాయి. దీనికి ప్రత్యామ్నాయంగా.. ప్రకృతి సిద్ధమైన వనమూలికలకు ఆధునిక పద్ధ్దతుల్ని జోడించి బి12 సప్లిమెంట్స్తో కూడిన బి-విటాశక్తి, ఐరన్ శక్తి, అలోవెరా జ్యూస్, ప్రీ డయాబెటిక్ పౌడర్ వంటి పదిహేను ఉత్పత్తులను అందిస్తున్నారు కల్పన. చిన్నపిల్లలు సహజంగానే మాత్రలు, పౌడర్లు తీసుకునేందుకు ఆసక్తి చూపరు. వారి కోసం రుచికరమైన విటమిన్ లడ్డూలను పరిచయం చేశారు.
వ్యాపార సూత్రంగా..
కల్పన కాకతీయ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఫార్మసీ చేశారు. స్వస్థలం వరంగల్. భర్త వేణు గోపాల్ ఉద్యోగి. పదేండ్ల నుంచీ కల్పన కుటుంబం హైదరాబాద్లోనే ఉంటున్నది. రెడ్డి ఉమెన్స్ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తూ.. ‘నేచురల్ ప్రొడక్ట్స్’పై పీహెచ్డీ చేశారు. కొవిడ్ సమయంలో చాలామందిలో తలెత్తిన అనారోగ్యాల నేపథ్యంలో ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తుల తయారీకి పూనుకున్నారు. తొలుత కుటుంబసభ్యులకు, బంధువులకు పరిచయం చేశారు. నాణ్యత పెంచేందుకు లోతైన అధ్యయనాలు చేశారు. వివిధ శిక్షణ కార్యక్రమాలకు హాజరయ్యారు. అన్ని వైపుల నుంచీ సానుకూల స్పందన రావడంతో.. దీన్నే వ్యాపార సూత్రంగా మలుచుకున్నారు.
ఆరోగ్యాన్ని అశ్రద్ధ్ద చేయొద్దు!
‘చాలామంది కెరీర్ పరుగులో పడిపోయి, బాధ్యతల బందిఖానాలో చిక్కుకుని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే.. మొదట్లోనే రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే ఇబ్బంది ఉండదు. ఉదాహరణకు.. మోకాళ్ల నొప్పులకు పెయిన్ కిల్లర్స్ వేసుకునేవారి సంఖ్య ఎక్కువే. కానీ, దీనివల్ల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే, చెడు ప్రభావాలు లేకుండా.. మోకాళ్లలో గుజ్జు పెరిగేందుకు దోహదపడే ఉత్పత్తిని అందించాలన్నదే నా ఆలోచన. ఆ దిశగా చురుకైన ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అంటారు కల్పన.