Health | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): గత నెలరోజులుగా దేశవ్యాప్తంగా భిన్నమైన వాతావరణం నెలకొన్నది. చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మందిలో జలుబు, తడి, పొడి దగ్గు, గొంతు, ఒంటి, తలనొప్పులతో పాటు జ్వరం వంటి లక్షణాలు ఎక్కువగా బయట పడుతున్నాయి. సాధారణ రోజుల్లో ఇవి మూడునాలుగు రోజులు.. గరిష్ఠంగా వారంలో తగ్గుతాయి. కానీ ఇప్పుడు కనీసం రెండు వారాల పాటు ఈ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి.
ఇన్ఫ్లూయెంజా, కొవిడ్ వంటి పరీక్షలు చేసినా నివేదికలన్నీ నార్మల్గానే వస్తున్నాయి. ప్రతి 10 మందిలో కనీసం ఐదారుగురిని ఇలాంటి లక్షణాలు వెంటాడుతున్నాయి. ఇందుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా మార్చి ప్రారంభమైన తర్వాత ఎండలు మొదలై.. మూడో వారానికి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈసారి మాత్రం ఫిబ్రవరి రెండోవారం నుంచే ఎండలు షురూ అయ్యాయి. దీంతో పొద్దంతా ఎండ, రాత్రుళ్లు చలి వంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇన్ఫ్లూయెంజా లక్షణాలు కనిపిస్తున్నాయి. జలుబు కన్నా దగ్గు దీర్ఘకాలం పాటు ఉండటం మాత్రం ఆందోళన కలిగిస్తున్నది.
వాతావరణంలో గాలి కాలుష్యం పెరిగిన కారణంగా విడువని జలుబు, దగ్గు సమస్యలు వస్తున్నాయని కొందరంటున్నారు. రోగనిరోధక శక్తి తగ్గడమే కారణమని మరికొందరు అంటున్నారు. ఇన్ప్లూయెంజా వైరస్పై కొం దరు నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏటా చలికాలం చివరన వచ్చే సమస్యే కావడంతో పెద్దగా అధ్యయనాలు జరగడం లేదు. అందుకే ఇది పెద్ద సమస్యే కాదని అంటున్నారు. చిన్నారులు, వృద్ధులు మాత్రం కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలని అంటున్నారు. సమస్య ఎక్కువైతే న్యుమోనియాకు దారితీసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కొవిడ్ కేసు ల్లో కాస్త పెరుగుదల కనిపిస్తున్నది. రాష్ట్రం లో చాలారోజులుగా కొవిడ్ కేసులు ఒక్క అం కెకే పరిమితమయ్యాయి. బుధవారం 21 కేసులు నమోదయ్యాయి. లక్షణాలు కనిపిస్తే కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు.
ప్రస్తుతం దగ్గు కొందరిని 3-4 వారాల పాటు బాధిస్తున్నది. కొవిడ్ వంటి టెస్టులు చేసినా అన్నీ నార్మల్గానే వస్తున్నాయి. దీనికి సరైన కారణం తెలియడం లేదు. విటమిన్-బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు వాడటం, గోరువెచ్చని నీరు తాగాలి. తాజా, వేడి ఆహారమే తీసుకోవాలి. తీవ్రమైతే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. – డాక్టర్ శోభన్బాబు, హెచ్వోడీ, ఈఎన్టీ విభాగం, గాంధీ