న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో కొవిడ్-19 పాజిటివిటీ రేటు గత వారం పదిశాతం పైగా నమోదైందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేరళలో ఈ తరహా జిల్లాలు ఆరు కాగా, ఈశాన్య రాష్ట్రాల్లో 29 జిల్లాలు, రాజస్ధాన్లో రెండు జిల్లాలు, హిమాచల్ ప్రదేశ్లో ఒక జిల్లా ఉన్నాయని పేర్కొంది. ఇక అధిక పాజిటివిటీ రేటు నమోదవుతున్న జిల్లాల్లో పశ్చిమ బెంగాల్లో ఒక జిల్లా, పుదుచ్చేరి నుంచి ఒక జిల్లా ఉన్నాయని తెలిపింది.
మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 40 కోట్ల మందికి పైగా ప్రజలకు కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు పూర్తయిందని వెల్లడించింది. వ్యాక్సినేషన్ రేటు క్రమంగా పెరుగుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇక దేశంలో డెల్టా వేరియంట్ ప్రభావాన్ని మదింపు చేస్తున్నామని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్కే సింగ్ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని, రాబోయే రోజుల్లో నూతన వేరియంట్ల ప్రభావాన్ని దీంతో అంచనా వేయవచ్చని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోందని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.