ఎండాకాలం అదనపు శక్తి కోసం గ్లూకోజ్ నీళ్లు, ఓఆర్ఎస్తో పాటు ప్యాకేజ్డ్ పండ్ల రసాలను ఎక్కువగా తీసుకుంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతవరకూ మేలుచేస్తాయి?
ఎండకు శరీరాన్ని నిస్సత్తువ ఆవహిస్తుంది. ద్రవాల అవసరం పెరుగుతుంది. దీంతో రకరకాల పానీయాల మీద ఆధారపడతాం. నీళ్లలో కలుపుకొని తాగే గ్లూకోజ్ కూడా అందులో ఒకటి. సంపూర్ణ ఆరోగ్యవంతులైతే, ఎండ వేడిమి వల్ల వచ్చే నీరసాన్ని అధిగమించడానికి రోజూ ఒక గ్లాసు వరకు గ్లూకోజ్ నీళ్లు తాగవచ్చు. ఇక ఓఆర్ఎస్లో శరీరానికి అవసరమైన పోషక లవణాలు ఉంటాయి కనుక.. వడదెబ్బ తగిలినా, ఒంట్లో నీటి శాతం తగ్గిపోయి నీరసం ఆవహించినా తీసుకోవచ్చు. పొట్టనొప్పి, వాంతులు, విరేచనాలు,
తలనొప్పి మొదలైనవన్నీ శరీరంలో నీరు తగ్గిందనడానికి హెచ్చరికలే. ఇక, ప్యాకేజ్డ్ జ్యూస్ విషయానికి వస్తే వాటిలో ప్రిజర్వేటివ్స్ కలపలేదని చెబుతారు కానీ, ఏదైనా పండు రసం ఆరునెలల దాకా నిల్వ ఉండాలంటే చక్కెరలాంటి ప్రిజర్వేటివ్స్ తప్పనిసరి. ఎప్పుడో ఒకసారి ఫర్వాలేదు కానీ, అధికంగా తీసుకుంటే మాత్రం ప్రమాదకరమే. వీటికి బదులుగా చక్కెర ఎక్కువగా కలపని తాజా పండ్ల రసాలు మేలు. అప్పటికప్పుడు తీసిచ్చే చెరుకు రసం కూడా మంచిదే. కొబ్బరినీళ్లు, మజ్జిగలాంటివి దేహాన్ని తీవ్ర ఉష్ణోగ్రతల నుంచి రక్షిస్తాయి. కాకపోతే బీపీ, మధుమేహం ఉన్నవారు గ్లూకోజ్, ఓఆర్ఎస్ లాంటివి తీసుకునే ముందు పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. సొంత నిర్ణయాలు ప్రమాదకరం.
-మయూరి ఆవుల న్యూట్రిషనిస్ట్ Mayuri.trudiet@ gmail.com