పండ్లు రుచిగా ఉంటాయి. బరువు తగ్గిస్తాయి. ఆరోగ్యాన్ని పెంచుతాయి. వీటిలో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. కాకపోతే, పండ్లను తినడానికి ఓ పద్ధతి ఉంటుంది.
పండ్లు త్వరగా జీర్ణం అవుతాయి. అదే, ఇతర పదార్థాలతో కలిపి తిన్నప్పుడు మాత్రం జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది. పొట్టలో అసౌకర్యం మొదలవుతుంది. అందుకే, పండ్లను విడిగా తీసుకోవాలి. రాత్రిపూట నిద్రకు రెండుమూడు గంటల ముందు నుంచీ పండ్లు తినకూడదు. పొట్టనిండా పండ్లు తిని నిద్రపోతే జీర్ణ సంబంధమైన సమస్యలు వస్తాయి. జీర్ణక్రియ కారణంగా నిద్రకు భంగం కలుగుతుంది. ఎందుకంటే? పండ్లు త్వరగా అరిగిపోతాయి. వీటిలో చక్కెరలు ఎక్కువ శాతం ఉంటాయి. అలాగే పోషకాలు కూడా అధికమే. మనం నిద్రపోతున్నప్పుడు శరీరం విశ్రాంతి స్థితికి చేరుకుంటుంది. రక్త సరఫరాలో మార్పులు ఉంటాయి. ఆ స్థితిలో శరీరం అన్ని పోషకాలనూ గ్రహించలేదు. ఫలితంగా ఎసిడిటీ పెరుగుతుంది. కాబట్టి, పండ్లను ఈవెనింగ్ స్నాక్స్గా తీసుకోవడమే ఉత్తమం.
నీళ్లు తాగితే ముప్పే ..
చాలామంది పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగుతారు. పుచ్చకాయ, ఖర్బూజ, దోస, నారింజ, స్ట్రాబెరీలో నీటి శాతం అధికం. వీటిని తిన్న తర్వాత నీళ్లు తాగితే పీహెచ్ స్థాయిలో మార్పు వచ్చి డయేరియా లేదా కలరా సమస్య తలెత్తవచ్చు.
తొక్క పారేయొద్దు
పండ్లు తిని తొక్క పారేయడం మంచిది కాదు. వాటిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఉదాహరణకు యాపిల్ పండ్ల తొక్కలో ఫైబర్, విటమిన్-సి, విటమిన్-ఎ అపారం. పండ్ల తొక్కలు తినడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. క్యాన్సర్నూ అధిగమించవచ్చని పరిశోధనల్లో గుర్తించారు.