మనం ఏ పనిచేసినా కూటి కోసమే. పుట్టింది మొదలు మరణించే వరకు శరీర రథయాత్ర సాఫీగా సాగడానికి ఆహారమే మనకు ఇంధనంగా ఉపయోగపడుతుంది. అందుకే ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని పేర్కొంటారు. ఏదో ఒకటి.. ఏదో ఒకలా తినేయకుండా ఓ పద్ధతి ప్రకారం ఎరుకతో తింటే మంచిది. మంచి ఆహారపు అలవాట్లే మన ఆరోగ్యానికి దోహదపడతాయి.
పళ్లెం నుంచి తీసుకునే మొదటి ముద్ద మొదలు చివరి ముద్ద వరకు ప్రతి మెతుకునూ ఆస్వాదిస్తూ తినాలి.
భోజన సమయంలో కేవలం ఆహారంపైనే దృష్టి సారించాలి. ఇతర విషయాల మీదికి మనసు మరల్చకూడదు.
ఓ మోస్తరు ఆకలి అనిపించినప్పుడే అన్నం తినాలి. అంతేకాని ఇష్టం వచ్చినట్టుగా పొట్టలో ఏదో ఒకటి వేసుకుంటూ ఉండ
కూడదు.
భోజనానికి అరగంట ముందు పండ్లు తీసుకోకూడదు. ఇలా చేస్తే పేగుల్లో పండ్లు ఫెర్మెంట్ (పులియడం) కావడం మొదలవుతుంది. అలానే పండ్లను మధ్యాహ్నం వేళ తినడం మంచిది. పడుకునే ముందు తింటే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. ఇబ్బందిగా ఉంటుంది.
బాగా నమిలి తినాలి. దీంతో జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. శరీరానికి పోషకాలు కూడా అందుతాయి.
ఎవరి పోషక అవసరాలు వారికే ప్రత్యేకంగా ఉంటాయి. కాబట్టి శరీర అవసరాలు, ఆహార పరిమితులను గమనించుకుని
నడుచుకోవాలి.
తాజా దినుసులతో ఆహారం వండుకోండి. వంట కూడా ఒకరకమైన ధ్యానం లాంటిదే. శ్రద్ధగా చేయాలి. అది తినేవారితో గాఢమైన సంబంధాన్ని కలిగి ఉంటుందనే విషయం మర్చిపోవద్దు.
పుల్లలు, చెంచాలు లాంటివి మన చేతికి సరిపడేవే ఎంచుకోవాలి. ఇలా చేస్తే మనం నెమ్మదిగా, మరింత ఎరుకతో భోంచేస్తాం.
తింటున్నప్పుడు నీళ్లు పరిమితంగా తాగాలి. ఇలా చేస్తే పొట్టలో ఆహారాన్ని జీర్ణం చేసే ఆమ్లాల గాఢత పలుచబడకుండా ఉంటుంది. తినడానికి అరగంట ముందు, తిన్నాక అరగంట తర్వాతే నీళ్లు తాగాలి.
బోర్గానో, ఒత్తిడితో ఉన్నప్పుడు తినొద్దు. కాసేపు నడిచాక, ఏదైనా తేలికపాటి పనిచేసిన తర్వాత విశ్రాంతిగా తినాలి.
రంగురంగుల పదార్థాలతో ఆహారాన్ని వర్ణరంజితం చేసుకోండి. పోషకాలనిచ్చే కొత్తకొత్త వంటకాలను ప్రయత్నించండి.
రోజులో పది గంటల విరామంలోనే భోజనం చేయాలి. ఇలా చేస్తే టైప్ 2 డయాబెటిస్, గుండె రక్తనాళాల వ్యాధుల నుంచి రక్షించుకో
వచ్చని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఏం వండుకోవాలనేది ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఇందుకు తాజా కూరగాయలు, ధాన్యాలు, పాల పదార్థాలు సిద్ధంగా ఉంచుకోవాలి.
ఓ ఆహార పుస్తకాన్ని ఉంచుకోండి. మీ భోజనానికి సంబంధించిన ప్రతి చిన్న వివరాన్నీ అందులో నమోదు చేయాలి.
వేపుళ్లలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది.
లావైపోతాం.. కాబట్టి వేపుళ్లకు నో చెప్పండి. చక్కెరలకు సారీ చెప్పండి. బర్గర్లకు బై బై చెప్పి బ్రకోలిని స్వాగతించండి.
ఏదైనా చిరుతిండికి ముందు కొన్ని నీళ్లు తాగాలి. మనం ఆకలి అనుకునేది కొన్నిసార్లు శరీరంలో తగినన్ని నీళ్లు లేవనేందుకు సూచన కావచ్చు.
చక్కెరలు ఎక్కువగా ఉన్న పానీయాల స్థానాన్ని తాజా కొబ్బరినీళ్లతో, పాలతో చేసిన టీ, కాఫీలను హెర్బల్ టీలతో భర్తీ చేయాలి.
సరైన భంగిమలో కూర్చుని తినాలి.
పద్మాసనమైతే మంచిది. పొలంలో విత్తనం నాటింది మొదలు ఆహారం మన పళ్లెంలో చేరుకునే వరకు చాలా ప్రయాణం జరిగి ఉంటుంది. ముద్ద తినేముందు కృతజ్ఞతలు తెలుపుకోవడం మర్చిపోవద్దు.
‘అన్నదాత సుఖీభవ’ ఉద్దేశం ఇదే.
చివరగా… మీకు ఎంత అవసరమో అంతమేరకే తినండి. వృథా వద్దు.
పోషకాలతో కూడిన తాజా ఆహారాన్నే తినాలి. ఇది ఆరోగ్యకరమైన శరీర నిర్మాణానికి దోహదపడుతుంది.
రోజులో మూడు ప్రధాన భోజనాల మధ్య ప్రొటీన్లు, ఫైబర్తో సమృద్ధమైన రెండు స్నాక్స్ ఉండేలా చూసుకోవాలి. వీటితో వెచ్చటి పానీయం సేవించాలి.
తినడానికి ముందు ప్రార్థన, తినే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, తిన్నాక శుద్ధిచేయడం లాంటి ఆచారాలు పాటించాలి.