న్యూయార్క్ : ఉల్లి పేరు వింటేనే అమెరికా ఉలిక్కిపడుతోంది. ఉల్లిగడ్డల ద్వారా వ్యాపిస్తున్న సాల్మోనెల్లా వ్యాధి అమెరికాను వణికిస్తోంది. ఉల్లి వినియోగంతో తాజాగా 652 మందికి ఈ వ్యాధి సోకగా 129 మంది దవాఖానల్లో చేరి చికిత్స పొందుతున్నారని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) గురువారం వెల్లడించింది. మెక్సికో నుంచి దిగుమతి చేసుకుని ప్రొసోర్స్ ఇంక్ పంపిణీ చేసిన ఈ ఉల్లిగడ్డలను ఇప్పటివరకూ తిప్పిపంపకపోవడంతో ఆందోళన రేకెత్తుతోంది. ఆగస్ట్ 27న చివరిసారిగా దిగుమతి చేసుకున్న ఈ ఉల్లిని అమెరికా అంతటా పలు రెస్టారెంట్లు, దుకాణాలకు సరఫరా చేశారు.
ఎరుపు, తెలుపు, గోధుమ రంగులో ఉండే ఈ ఉల్లి అంటేనే అమెరికన్లు ఇప్పుడు గజగజ వణికిపోతున్నారు.కరోనా వైరస్ కంటే ప్రమాదకరంగా భావిస్తున్న సాల్మోనెల్లా వ్యాప్తికి కారణమైన ఈ ఉల్లి ఇంకా అమెరికన్ స్టోర్స్లో వినియోగంలో ఉందనే వార్తలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. స్టోరేజ్ కూలర్లలో ఈ రకమైన ఉల్లి కనిపిస్తే వెంటనే పారవేయాలని సీడీసీ ఆయా దుకాణాలు, రెస్టారెంట్లను కోరుతోంది. ఈ రకాలైన ఉల్లిని కలిగిఉంటే ఆయా ఉపరితలాలను శుభ్రం చేసి శానిటైజ్ చేయాలని సూచించింది.
కాగా, ఫుడ్ పాయిజన్ కలిగించే సాల్మోనెల్లా బ్యాక్టీరియా వ్యాధి బారినపడుతున్న వారి సంఖ్య అమెరికా, కెనడాల్లో పెరుగుతుండటం కలవరం కలిగిస్తోంది. ఈ వ్యాధి కారణంగా డయేరియా జ్వరం, కడుపునొప్పి వంటివి వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సీడీసీ సూచించింది. నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.