న్యూఢిల్లీ : యువత, వయసు పైబడిన వారు చురుకుగా, ఆరోగ్యంగా, ఫిట్గా ఉండేందుకు కీలక పోషకాలు, విటమిన్లు అత్యంత ఆవశ్యకమని నిపుణులు చెబుతున్నారు. సమతుల ఆహారం విధిగా తీసుకుంటేనే శారీరకంగా చురుకుగా ఉండటం సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఆధునిక జీవితంలో ఒత్తిడితో చిత్తవుతున్న క్రమంలో పలువురిలో పోషకాహార సమస్యలు తలెత్తుతున్నాయి. శరీరానికి కీలక పోషకాలు అందకపోవడంతో యువతలో సైతం ఐరన్, అయోడిన్, బీ, డీ వంటి కీలక విటమిన్ల లోపం కనిపిస్తోంది. ఆహారం ద్వారా కీలక విటమిన్లు పొందలేని వారు, శరీరం వాటిని సరిగ్గా గ్రహించలేని వారికి సప్లిమెంట్లు తప్పనిసరి.
ముఖ్యంగా క్యాప్సుల్ రూపంలో లభ్యమయే మల్టీవిటమిన్లను వైద్యుల సూచన మేరకు తీసుకోవాల్సి ఉంటుంది. మల్టీవిటమిన్లు గుండె జబ్బు, క్యాన్సర్ ముప్పును తప్పించడంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజువారీ సవాళ్లను ఎదుర్కొనేలా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్యకర శరీరానికి అవసరమైన ఒమెగా-3ని ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటి ద్వారా కొలెస్ట్రాల్ కరిగి జీవక్రియల రేటు మెరుగవడంతో పాటు గుండెకు మేలు కలుగుతుంది. ఒమెగా-3 సరిపడినంత శరీరానికి అందితే శ్వాస సమస్యలు తొలగడం, నాడీమండల వ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది.
ఇవి కూడా క్యాప్సుల్ రూపంలో అందుబాటులో ఉంటాయి. ఇక సూర్యరశ్మి విటమిన్గా పేరొందిన విటమిన్ డీ శరీరానికి ఉత్తేజం అందించడంతో పాటు ఎముకలు, కండర పుష్టికి ఉపకరిస్తుంది. ఇక శరీరానికి అవసరమైన శక్తి ఇచ్చేందుకు విటమిన్ బీ ఎంతో అవసరం. ఆహారం ద్వారానే ఈ విటమిన్లు, పోషకాలు అందేలా చూసుకోవడం మేలని, తప్పనిపరిస్ధితుల్లో విధిగా సప్లిమెంట్ల రూపంలో వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.