Dengue | చికిత్సా పద్ధతులు ఖళ్లు ఖళ్లుమని దగ్గులు. హాచ్ హాచ్ అంటూ తుమ్ములు. ముక్కు చీదుతున్న దృశ్యాలు. ఇంటిల్లిపాదినీ వేధిస్తున్న జ్వరాలు. ఎవరికి తెలుసు? ఇది డెంగీ లక్షణమైనా కావచ్చు. ఎందుకైనా మంచిది. వైద్యులను సంప్రదించాలి. మందులు వాడాలి. నిర్లక్ష్యం చేస్తే డెంగీ ప్రాణాంతకం అవుతుంది.
వర్షాలు వచ్చేశాయి. అంటురోగాలు ముసురుకుంటున్నాయి. వానకాలం ప్రారంభంతో సీజనల్ వ్యాధులు సహజమే. అందులోనూ దోమకాటు వల్ల, నీటి వల్ల వచ్చేవి అధికం. డెంగీ, మలేరియా, డయేరియా, ఫ్లూ, కామెర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కావచ్చు, వానలో తడవడం వల్ల కావచ్చు.. ఎక్కువ మంది జలుబు, దగ్గు, జ్వరాలకు గురవుతుంటారు. అయితే, ఆ వచ్చింది సాధారణ జ్వరమా, డెంగీనా అనేది తెలుసుకోవడం ముఖ్యం. కొందరిలో, డెంగీ సాధారణ జ్వరంలానే వచ్చి పోతుంది. మరికొందరిని ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్తుంది. ఇంకొందరిలో, మొదటిసారి సాధారణ జ్వరంలా వచ్చి, సాధారణంగానే తగ్గిపోతుంది. కానీ రెండోసారి మాత్రం పరిస్థితి తీవ్రంగా మారే ఆస్కారం ఉంది. కాబట్టి, ఏమాత్రం అనుమానం వచ్చినా డాక్టర్లను సంప్రదించి డెంగీ నిర్ధారణ పరీక్షలు చేయించు కోవడం ఉత్తమం.
రాత్రీపగలూ..
దోమలు రెండు రకాలు. రాత్రిపూట కుట్టేవి, పగటిపూట కుట్టేవి. అనాఫిలిస్, క్యూలెక్స్ దోమలు రాత్రిపూట కుడతాయి. వీటివల్ల మలేరియా, ఫైలేరియా(బోదకాలు), చికున్ గున్యా వస్తాయి. అందులోనూ, ఐదేండ్లలోపు పిల్లలకు మెదడువాపు వస్తుంది. దోమలు ముందుగా పందులను కుట్టి, ఆ తరువాత మనుషులను కుడితే మెదడు వాపు దాపురిస్తుంది. ఫలితంగా, పిల్లల్లో మెదడు వాచిపోతుంది, ఫిట్స్ వస్తాయి. ఓ దశలో మృత్యువాత పడతారు. ఇది చాలా ప్రమాదకరం. కాకపోతే, మన రాష్ట్రంలో ఈ రుగ్మత ఏమంత తీవ్రంగా లేదు. ఇక, ‘ఈడిస్ ఈజిైప్టె’ దోమలు పగలు మాత్రమే కుడతాయి. ఇతర దోమల్లా ఇవి మురికినీటిలో ఉండవు. జనావాసాలను చిరునామాగా ఎంచుకుంటాయి. మంచినీటిలోనే.. అంటే ఇళ్లలోని పూల కుండీలు, కూలర్లు, పరిసరాల్లో నిలిచిపోయిన నీళ్లు, ఇంటి ఆవరణలో వృథాగా పడున్న కొబ్బరి పీచు, రబ్బరు టైర్లు మొదలైన వాటిలో పేరుకుపోయిన నీటిలో వృద్ధి చెందుతాయి. ఇవి కుట్టడం వల్ల డెంగీ జ్వరం వస్తుంది.
అనుమానించాల్సిందే
సాధారణంగా డెంగీ అనగానే ప్లేట్లెట్స్ సంఖ్యపై దృష్టి పెడతారు ఎవరైనా. డెంగీ వల్ల వాటి పరిమాణం తగ్గుతుందని భావిస్తారు. నిజానికి, ఇతర సమస్యలు ఉన్నప్పుడు కూడా ప్లేట్లెట్స్ తగ్గుతాయి. కాబట్టి, ఆ ఒక్క కారణంతోనే డెంగీగా భావించలేం. ప్లేట్లెట్స్ తగ్గడంతో పాటు తీవ్రమైన జ్వరం, ఒంటినొప్పులు, భరించలేని తలనొప్పి డెంగీ రోగులను ఇబ్బంది పెడతాయి. రక్త పరీక్షలో తెల్ల రక్తకణాలు కూడా తగ్గినట్లు నిర్ధారణ జరిగితే మాత్రం డెంగీగా అనుమానించాల్సిందే.
☞ తీవ్రమైన జ్వరం. భరించలేని తలనొప్పి.
☞ తీవ్రమైన ఒంటినొప్పులు కూడా ఉంటాయి. అందుకే దీన్ని ‘బ్రేక్బోన్ ఫీవర్’ అనీ అంటారు.
☞ ఏకధాటిగా ముక్కు కారడం.
☞ చర్మంపై ఎర్రటి దద్దుర్లు.
☞ రిట్రో ఆర్బిటాల్ పెయిన్
(కనుగుడ్డు వెనక నొప్పి).
☞ హెమటోక్రిట్స్ తగ్గుతాయి.
☞ అధిక దాహం.
☞ బీపీ పడిపోవడం.
☞ చిన్న పిల్లల్లో వాంతులు, విరేచనాలు ఉండవచ్చు.
ఎలిసా మెటల్తో నిర్ధారణ
డెంగీ జ్వరం నిర్ధారణను ‘ఎలిసా-మెటల్’ పరీక్షల ద్వారానే జరపాలి. ఈ విధానంలో మూడు రకాల టెస్టులు ఉన్నాయి.
ఎన్ఎస్1 యాంటీజెన్ పరీక్ష జ్వరం వచ్చిన ఒకటో రోజు నుంచి ఐదోరోజు లోపు.. ఎన్ఎస్1 యాంటీజెన్ పరీక్ష ద్వారా డెంగీని నిర్ధారించవచ్చు.
ఐజీఎం యాంటీబాడీ పరీక్ష
ఐదో రోజు నుంచి ఏడో రోజు లోపు ఐజీఎం యాంటీబాడీ పరీక్ష చేయించవచ్చు. అంటే, జ్వరం వచ్చిన వారం రోజుల వరకు ఐజీఎం పరీక్ష ద్వారా రోగిలో డెంగీని కచ్చితంగా కని పెట్టవచ్చు.
ఐజీజీ యాంటీబాడీ పరీక్ష
ఏడు నుంచి పది రోజుల్లో.. అంటే జ్వరం వచ్చినప్పటి నుంచి పదీపన్నెండు రోజుల్లోపు ఐజీజీ యాంటీబాడీ పరీక్షలు చేయించడం ద్వారా ఎవరిలోనైనా డెంగీని నిర్ధారించవచ్చు.
నిర్లక్ష్యం వద్దు..
కొంత మందిలో డెంగీ వారం రోజుల్లో తగ్గి పోతుంది. మరికొందరికి ఒకసారి జ్వరం వచ్చి తగ్గిపోయి.. రెండోసారి వస్తుంది. ఇప్పుడు కూడా కొన్ని రోజుల తర్వాత ఉన్నట్టుండి తగ్గిపోతుంది. జ్వరం తగ్గింది కదా అని నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం రావచ్చు. డెంగీలో ఇది ప్రమాదకరమైన దశ. ఇలా జ్వరం వచ్చి.. హఠాత్తుగా తగ్గిన తర్వాత కొందరికి అకస్మాత్తుగా బీపీ పడిపోయి రక్తం చిక్క
బడుతుంది. పల్స్ రేటు పడిపోతుంది. శరీరంలోని వివిధ భాగాల నుంచి రక్తస్రావం అవుతుంది. మలం రంగు నల్లగా మారి పోతుంది. మూత్రంలో రక్తం పడుతుంది. ఇందులో ఏకొన్ని లక్షణాలు కనిపించినా రోగి ప్రమాదకర దశలో ఉన్నట్టే. వెంటనే హాస్పిటల్లో చేర్పించాలి. రక్తం చిక్కబడకుండా సాధారణ స్లైన్ అందించాలి. ప్లేట్లెట్స్ 20 వేల కంటే తగ్గినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 10 వేలకు తగ్గితే.. వెంటనే ప్లేట్లెట్స్ ఎక్కించాలి.
☞ ఇంట్లో, పరిసరాల్లో నీరు నిలువకుండా చూసుకోవాలి.
☞ కూలర్లు, పూల కుండీలు, ఏసీలు, పాత సామాన్లలోని నీటిని తరచూ తొలగించాలి.
☞ పాత రబ్బరు టైర్లు, కొబ్బరిపీచు, చిప్పలు చుట్టుపక్కల లేకుండా జాగ్రత్త పడాలి.
☞ దోమల నివారణకు తెరలు వాడాలి. అవసరమైతే మస్కిటో కాయిల్స్ వెలిగించాలి.
☞ వారానికి ఒకసారి ‘డ్రై డే’ పాటించాలి. ఇంట్లోని నీటి ట్యాంకులను పూర్తిగా ఖాళీచేసి, ఆరబెట్టాలి.
☞ జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపిస్తే దగ్గర్లోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి.
☞ వైద్యులు సూచించిన మందులు వాడాలి.
☞ అవసరమైతే వైద్యపరీక్షలు చేయించుకోవాలి.
☞ జ్వరం పెరిగితే వైద్యుల సిఫారసుతో తగిన మందులు వాడాలి.
☞ వాంతులు, విరేచనాలు జరిగితే.. ఓఆర్ఎస్ ద్రావణం ఇస్తూ వెంటనే హాస్పిటల్లో చేర్పించాలి.
☞ బలమైన రోగ నిరోధక వ్యవస్థలేని వ్యక్తులు చాలావేగంగా డెంగీ బారిన పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి, ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా..పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి. అందులోనూ గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రసవం తర్వాత, ఆ ప్రభావం నవజాత శిశువు మీద పడే ప్రమాదం ఉంది.