Parenting Tips | మా బాబు వయసు మూడేండ్లు. కానీ అస్సలు సరిగ్గా భోజనం చేయడు. ఎంత తినిపించినా తినడు. చక్కగా ఆటలాడతాడు. చురుగ్గా ఉంటాడు. భోజనమే సమస్య. నన్నేం చేయమంటారు?
– ఓ పాఠకురాలు
ఇది చాలా మంది తల్లిదండ్రులు అడిగే ప్రశ్నే. బిడ్డకు ఎలాంటి ఇబ్బందీ లేకపోతే.. ఆ బిడ్డ బరువు, ఎత్తు ఎలా ఉంది అని గ్రోత్ చార్ట్ ద్వారా లెక్కిస్తారు. ఒక వేళ పిల్లలు ఆ ప్రకారం ఎదగాల్సినంత ఎదిగితే మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ పిల్లలు భోజనం ఎందుకు చేయరంటే, అందుకు ప్రధాన కారణం వాళ్ల ప్రవర్తన. దీన్ని బిహేవియరల్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు. ఒకటి నుంచి అయిదు సంవత్సరాల పిల్లలు, నడవడం మొదలు పెట్టినప్పటి నుంచి తమ చుట్టుపక్కల పరిస్థితులు, పరిసరాలను తెలుసుకునేందుకు ఉత్సాహంగా ఉంటారు. కానీ వాళ్లకి చిరుతిండ్లు, ముఖ్యంగా జంక్ఫుడ్ అలవాటు చేస్తే.. సరిగ్గా భోజనం చేయరు. పాలు కూడా రోజుకు 300 మిల్లీ లీటర్లు సరిపోతాయి. ఏడాది దాటాక డబ్బా పాలు ఇవ్వకూడదు. రెండేళ్ల వరకూ తల్లిపాలు ఇవ్వచ్చు. కానీ పిండిపదార్థాలు, కొవ్వులు, ప్రొటీన్లు సమతులంగా ఉండేలా మిగతా అవసరమైన ఆహారం అందించాలి.
1. బిడ్డకు బలవంతంగా ఏమీ తినిపించకూడదు.
2. చిరుతిండ్లు, పాలు తగ్గించాలి.
3. తినేప్పుడు టీవీలు, ఫోన్లు పెట్టొద్దు.
4. అన్నం తినిపించే సమయం 30 నుంచి 40 నిమిషాలు మించకూడదు.
5. బిడ్డ భోజనాన్ని రంగుల కూరగాయల ముక్కలు, గుడ్డులాంటివి కలిపి కాస్త విభిన్నంగా కనిపించేలా చేయాలి.
6. కుటుంబ సభ్యులు కలిసి తినేప్పుడే పిల్లలకు తినిపించాలి.
7. వంట చేసేప్పుడు పిల్లల్ని కూరగాయలు అందించమనడం లాంటివి చేస్తే వాళ్లకి భోజనం మీద ఆసక్తి పెరుగుతుంది.
పిల్లలు బరువు పెరగకపోయినా, బరువు తగ్గుతున్నా, నీరసంగా ఉన్నా.. వైద్యులను తప్పక సంప్రదించాలి.
– డాక్టర్ విజయానంద్ నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్