రోజూ వీలైనంత త్వరగా భోజనంచేస్తే గుండె రక్తనాళాల వ్యాధుల ముప్పు తగ్గుతుందట. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 1,03,389 మంది నుంచి ఆహార విధానాలు, గుండె రక్తనాళాల జబ్బులకు సంబంధించిన సమాచారం సేకరించారు. వీరిలో 79 శాతం మంది మహిళలే. పరిశోధనలో పాల్గొన్నవాళ్ల సగటు వయసు 42 ఏండ్లు..
Health Tips | వయసు, లింగం, కుటుంబ పరిస్థితి మొదలైన సామాజిక పరిస్థితులు, ఆహారంలో పోషకాల నాణ్యత, జీవనశైలి, నిద్రా చక్రాన్ని పరిశోధకులు పరిగణనలోకి తీసుకున్నారు. పొద్దున్నే టిఫిన్ చేయకుండా భోజనం చేసేవారిలో ఒక్కో గంట ఆలస్యానికి గుండె రక్తనాళాల వ్యాధుల తీవ్రత 6 శాతం పెరుగుతుందని పరిశోధకులు కనుక్కొన్నారు. అంటే పొద్దునే 9 గంటలకు తినే వ్యక్తికి 8 గంటలకే తిన్న వ్యక్తితో పోలిస్తే గుండె రక్తనాళాల జబ్బుల ముప్పు 6 శాతం ఎక్కువగా ఉంటుందన్నమాట. 9 తర్వాత ఒక్కో గంట గడుస్తుంటే ఈ ముప్పు 28 శాతం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. అయితే, ముందురోజు రాత్రి చివరి భోజనానికి, తర్వాతి రోజు ఉదయం భోజనానికి మధ్య విరామం ఎక్కువగా ఉంటే గుండె రక్తనాళాల వ్యాధుల ముప్పు తక్కువట. అలా ఈ పరిశోధన రోజూ పొద్దున, సాయంత్రం భోజనాలు వీలైనంత త్వరగా ముగించేయాలని వెల్లడిస్తున్నది.
గ్లోబల్ బర్డన్ ఆఫ్ డిసీజెస్ అధ్యయనం ప్రకారం ప్రపంచ ప్రజల్లో మరణాలకు కారణమయ్యే వ్యాధుల్లో గుండె రక్తనాళాల సమస్యలే ముందువరుసలో ఉన్నాయి. 2019లో గుండె సమస్యలతో 18.6 మిలియన్ల మంది మరణించారు. వీటిలో 7.9 శాతం మరణాలకు ఆహారపు అలవాట్లే ప్రధాన కారణంగా నిలిచాయి. అంటే… “ఈ తరహా వ్యాధుల పుట్టుక, అభివృద్ధిలో ఆహారం కీలకపాత్ర పోషిస్తున్నదని తెలుస్తుంది. పశ్చిమ దేశాల సమాజాల ఆధునిక జీవనశైలి రాత్రి భోజనం మరీ ఆలస్యంగా చేయడం, పొద్దునే టిఫిన్ తీసుకోకపోవడం మొదలైన ఆహారపు అలవాట్లకు దారితీసింది. అయితే, ఉదయం, రాత్రి భోజనాలు వీలైనంత తొందరగా ముగించుకునే అలవాట్లను స్వీకరిస్తే గుండె రక్తనాళాల వ్యాధుల ముప్పు తగ్గించుకోవచ్చు” అని పరిశోధకులు పేర్కొన్నారు.