మనం రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లు.. అంటే ఎనిమిది గ్లాసులు తాగాలనే నియమం తెలిసిందే. శరీరానికి ఆహారం రూపంలోనూ నీళ్లు అందుతాయి. అయితే, ఇటీవలి ఓ పరిశోధన మాత్రం నీళ్లు తాగడం అనేది గ్లాసుల కొలత మీద ఆధారపడి ఉండదని తేల్చి చెప్పింది. మన శరీర తత్వం, మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ నివసిస్తున్నాం అనే అంశాల మీద నీళ్ల లెక్క ఆధారపడి ఉంటుందని ప్రకటించింది. దీనిని నిర్ధారించడానికి పరిశోధకులు 23 దేశాలకు చెందిన 5,604 మంది మీద అధ్యయనం నిర్వహించారు.
వయసు, శరీర కష్టం, ఉంటున్న ప్రదేశం ఎత్తు, గాలిలో ఉష్ణోగ్రత మొదలైన వాటిమీద మనం నీళ్లు తీసుకునే పరిమాణం ఆధారపడి ఉంటుందని కనుగొన్నారు. భోజనం చేస్తున్నప్పుడు, వ్యాయామానికి ముందు, వ్యాయామం చేస్తున్నప్పుడు, బాగా దాహంగా ఉన్నప్పుడు నీళ్లు తాగితేనే మనలో తగినంత హైడ్రేషన్ ఉంటుందని నిర్ధారించారు.